చిట్ఫండ్ కంపెనీల అమానుష విధానాలపై జిల్లా ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు
కరీంనగర్ క్రైం, జూన్12(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో పలు చిట్ఫండ్ కంపెనీలు అనుసరిస్తున్న అమానుష, చట్టవిరుద్ధ విధానాలపై న్యాయవాది ఏ.వి. రమణ జిల్లా ప్రధాన న్యాయమూర్తికి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కపిల్ చిట్ ఫండ్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్ వంటి ప్రముఖ సంస్థలు అమలు పిటిషన్ల విషయంలో చట్టబద్ధమైన నిబంధనలను పూర్తిగా కాలరాస్తున్నాయని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు.
అనేక సందర్భాల్లో చిట్ఫండ్ కంపెనీలు చందాదారులకు, షూరిటీలకు చట్టప్రకారం అందజేయాల్సిన నోటీసులను సరైన విధానంలో సర్వీస్ చేయడం లేదని ఏ.వి. రమణ పేర్కొన్నారు. బాధితులకు తమ వాదనలను కోర్టు ముందు వినిపించే కనీస అవకాశం కూడా కల్పించకుండా,ఏకపక్షంగా అమలు పిటిషన్ల ఆదేశాలు, వారెంట్లు పొందుతున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
నోటీసుల సక్రమ సర్వీస్ లేకుండానే తీసుకునే ఇలాంటి బలవంతపు చర్యలు సహజ న్యాయ సూత్రాలకు పూర్తిగా విరుద్ధమని, దీనివల్ల అమాయక సాధారణ ప్రజలు తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నోటీసులు సక్రమంగా జారీ అయ్యాయా లేదా అనే అంశంపై తగిన పరిశీలన లేకుండానే బలవంతపు చర్యలు చేపట్టడం వల్ల సాధారణ ప్రజలు నష్టపోతున్నారని, ఈ అంశంపై న్యాయవ్యవస్థ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ అక్రమ విధానాల నేపథ్యంలో, చిట్ఫండ్ కంపెనీలు దాఖలు చేస్తున్న అమలు పిటిషన్లలో నోటీసుల జారీ విధానం, వాటి సర్వీస్ ప్రక్రియ, అలాగే వారెంట్ల జారీపై సమగ్ర విచారణ జరపాలని ఆయన జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కోరారు. భవిష్యత్తులో చట్టబద్ధమైన విధానాలు కచ్చితంగా అమలయ్యేలా అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.సాధారణ ప్రజల హక్కులను కాపాడటం, సహజ న్యాయ సూత్రాలను పరిరక్షించడం, పౌరుల్లో న్యాయ ప్రక్రియలపై నమ్మకం, విశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా తాను ఈ ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది ఏ.వి. రమణ స్పష్టం చేశారు.






