విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్
చెన్నై: తమిళనాడులో ప్రజా ప్రభుత్వానికి మద్దతిచ్చిన సభ్యులకు సీఎం విజయ్(CM Vijay Speech) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడు ప్రజలు తమకు అండగా ఉన్నారని వివరించారు. పార్టీ ప్రారంభించిన మూడేళ్లలోపలే అధికారంలోకి వచ్చామని తెలిపారు. మైనార్టీల హక్కులను కాపాడుతామని హామీ ఇచ్చారు. అంబేద్కర్, పెరియార్, కామరాజ్ ఆకాంక్షల మేరకు పనిచేస్తామని సూచించారు.
మా పార్టీ గుర్తు విజిల్.. తమిళనాడు చరిత్రను మార్చిందని పేర్కొన్నారు. ఇంతమందితో ఏర్పడిన మా కూటమి.. ప్రజా కూటమి అన్నారు. ఈ ప్రభుత్వం.. నాకు వ్యతిరేకంగా ఓటు వేసిన వారిది కూడా అన్నారు. ఈ ప్రజా కూటమి.. ప్రజాసేవ కోసమేనని విజయ్ వెల్లడించారు. ప్రజలను నమ్ముకుని ఎన్నికల్లో పోటీచేశామన్న విజయ్ అన్ని వర్గాలకు తమపై నమ్మకం ఉందన్నారు. టీవీకే ప్రభుత్వంలో అందరికీ సమాన అవకాశాలుంటాయని చెప్పారు. మూడేళ్లలోనే 34.92 శాతం ఓటింగ్ సాధించామని వివరించారు. అధికారంలో ఉన్నామని ఎవరినీ బెదిరించమని, పదవులు, రాజకీయాల కోసం పాకులాడమన్నారు.
తమిళనాడు అసెంబ్లీలో(Tamil Nadu Assembly) ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తన తొలి అడ్డంకిని అధిగమించారు. సభలో జరిగిన విశ్వాస తీర్మానంలో విజయ్ టీవీకే ప్రభుత్వం 144 ఓట్లతో బలపరీక్షలో నెగ్గింది. మరోవైపు, 22 మంది ఎమ్మెల్యేలు విశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించగా, ఐదుగురు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. బుధవారం జరగనున్న ఓటింగ్కు ముందు, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ TVK ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రసంగించిన అనంతరం, DMK ఎమ్మెల్యేలందరితో కలిసి సభ నుండి వాకౌట్ చేసి విజయ్ కు షాకిచ్చారు. బుధవారం నాడు AIADMK రెబెల్స్ను కలిసినందుకు ఆయన విజయ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్నది "మార్పు" (change) ఆ లేక "మార్పిడి" (exchange) ఆ అని ప్రశ్నించారు. ఇంతలో AIADMK నాయకుడు S.P. వేలుమణి తిరుగుబాటు ఎమ్మెల్యేలందరినీ TVKకి అనుకూలంగా ఓటు వేయించేందుకు నడిపించడంతో సభలో గందరగోళం చెలరేగింది.






