ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన బండి రమేష్
కూకట్ పల్లి,(విజయక్రాంతి): కూకట్ పల్లి నియోజకవర్గంలో విస్తృతంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియ ను టిపిసిసి ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ సర్కిల్ ఉప కమిషనర్ ఆంజనేయులుతో కలిసి శనివారం పర్యవేక్షించారు. బాలాజీ నగర్ లో బిఎల్ఓలు బిఎల్ఏలు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ పత్రాలను ఓటర్లకు అందజేశారు. ఓటర్ పేరుతో ప్రింట్ అయిన రెండు పత్రాలలో ఓటర్ వివరాలను నమోదు చేసిన అధికారులు ఓ పత్రాన్ని ఓటర్ కు ఇవ్వగా మరో పత్రాన్ని తీసుకుని ఓటర్ వివరాలను కంప్యూటర్ లో అప్లోడ్ చేయనున్నారు. ఇక్కడ జరుగుతున్న ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ,ఓటరు వివరాల నమోదును డిసి స్వయంగా పరిశీలించారు.
ఎస్ ఐ ఆర్ కార్యక్రమంలో పాల్గొనే పార్టీ నాయకులకు బండి రమేష్ పలు సలహాలు, సూచనలు చేశారు. నియోజవర్గంలో నివసిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి ఓటు నమోదు కావాలని, అదే సమయంలో స్థానికంగా కొంతకాలంగా లేని వారిని గుర్తించి, వారి ఓట్లను తొలగించాలని ఎట్టి పరిస్థితుల్లో దొంగ ఓట్లు నమోదు చేయరాదని అధికారులకు సూచించారు. ఓటర్ నమోదు ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని నిర్లక్ష్యంగా వహించిన నాయకులపై పార్టీపరంగా తగు చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా డిసి ఆంజనేయులు మాట్లాడుతూ ఓటర్ నమోదు వివరాలు అత్యంత ఖచ్చితత్వంతో కూడి ఉంటాయని ఎవరి ఓటయినా లేకపోయినా కొత్తగా ఓటరు గా నమోదు కావాలన్నా అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు.






