శ్రీ ఇందు కాలేజీ బస్సుల తనిఖీ
వెలుగులోకి భారీ లోపాలు
ఇబ్రహీంపట్నం,(విజయక్రాంతి): షేరిగూడలోని శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ బస్సులకు ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సి.హెచ్. జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భద్రతా తనిఖీలు నిర్వహించారు. మొత్తం 13 బస్సులను పరిశీలించగా, విద్యార్థుల భద్రతను ప్రమాదంలో పడేసే పలు తీవ్ర లోపాలు బయటపడ్డాయి.13 మంది డ్రైవర్లకు యూనిఫాం లేదు; ఏ బస్సులోనూ హెల్పర్లు/అటెండెంట్లు లేరు. నలుగురు డ్రైవర్ల వయస్సు 60 ఏళ్లు దాటింది.
కొన్ని బస్సులకు అరిగిపోయిన టైర్లు, పనిచేయని ఇండికేటర్లు, బ్రేక్ లైట్లు ఉన్నాయి. ఒక బస్సుకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపు లేదు. మరికొన్నింటిలో ఎమర్జెన్సీ హ్యామర్లు లేవు. ఈ లోపాలపై స్పందించిన ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, విద్యార్థుల రక్షణ దృష్ట్యా వీటిని తక్షణమే సరిచేయాలని కళాశాల యాజమాన్యాన్ని ఆదేశించారు. నిబంధనల ప్రకారం అటెండెంట్లను నియమించాలని, డ్రైవర్లు యూనిఫాం ధరించేలా చూడాలని మరియు రోడ్డు భద్రతాప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు.






