జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన
జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి అన్యాయం చేశాడు
హైదరాబాద్: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, షర్మిల ఆస్తుల పంచాయతీపై తల్లి వైఎస్ విజయమ్మ(YS Vijayamma ) సంచలన ప్రకటన చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వరకు ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని నోటరీ చేసిన నోట్ ను విజయమ్మ విడుదల చేశారు. వైఎస్ మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని పేర్కొన్నారు. ఆస్తులన్నీ నలుగురు మనవలకు సమానంగా పంచాలని వైఎస్ ఉద్దేశమని తెలిపారు. వైఎస్ ఆదేశం కూడా అదే.. దగ్గర వాళ్లందరికీ తెలిసిన వాస్తవమిదన్నారు. ఎంవోయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు దక్కాల్సినవేనని స్పష్టం చేశారు.
అందుకే జగన్ ఎంఓయూ రాశాడని విజయమ్మ పేర్కొన్నారు. నిజం చెప్పాలంటూ షర్మిలకు తక్కువే రాశాడని వెల్లడించారు. సరస్వతి సిమెంట్ సహా యెలహంక ల్యాండ్ కూడా షర్మిలదే అన్నారు. ఇచ్చానని చెబుతున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెండే అన్నారు. జగన్ తన మేనల్లుడికి, మేకకోడలికి అన్యాయం చేశాడని విజయమ్మ ఆరోపించారు. జగన్ ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. షర్మిలకు ఇచ్చిన ఆస్తులు లాంటివి జగన్ కు కూడా వైఎస్ ఇచ్చారని స్పష్టం చేశారు. అది ఆస్తి పంపకం కాదన్నారు. నిజం ఏమిటో నా దేవుడికి, నా కొడుక్కీ తెలుసన్నారు. అబద్ధాలు ప్రచారం చేయవద్దని చేతులు జోడించి కోరుతున్నానని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి సాక్షిగా నేను రాసి ఇచ్చినవన్నీ వాస్తవాలేనని విజయమ్మ ప్రకటించారు.





