వాడి పోతున్న కంది.. పత్తి మొక్కలు
* ఆందోళనలో గిరిజన రైతులు
ఉట్నూర్,(విజయక్రాంతి): మృగశిర కార్తి ప్రారంభంలో కురిసిన వర్షపు చిరుజల్లులకు ఏజెన్సీ ప్రాంతంలోని రైతులు పత్తి, కంది విత్తనాలను పంట పొలాల్లో విత్తనాలు వేశారు. మృగశిర కార్తి లో పత్తి విత్తనాలు విత్తడంతో అధిక దిగుబడి వస్తుందని కొండంత ఆశలతో ఖరీదైన విత్తనాలను కొనుగోలు చేసి సాగు భూములలో విత్తనాలు వేశారు. తొలకరి జల్లులకు మొలకెత్తిన పత్తి, కంది పంటలు తీవ్రమైన ఎండలకు వాడిపోతున్నాయి.
ఈ మొక్కలను చూసి సాగు భూముల్లో వితిన్న విత్తనాలు 70 శాతం మొలకెత్తలేదని, మొలకలు వచ్చిన పత్తి మొలకలు వాడిపోవడం చూసి రైతులు లబో దిబో అంటున్నారు . రెండోసారి పత్తి విత్తనాలు కొనుగోలు చేయాలంటే చేతిలో డబ్బులు లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరుణ దేవుడు రైతులపై కన్నేర చేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వానదేవుడు కరుణించాలని గ్రామదేవతలకు, అడవి దేవతలకు రైతులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.






