ఆస్తి కోసం భర్తను హత్య చేసిన భార్య
కేసును ఛేదించిన మియాపూర్ పోలీసులు
శేరిలింగంపల్లి, జూలై 8 (విజయక్రాంతి): మియాపూర్లో గత ఏడాది నమోదైన మిస్సింగ్ కేసు దారుణ హత్యగా తేలింది. భర్త ఆస్తి కోసం భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసి శవాన్ని మహారాష్ట్రలో తగలబెట్టిన ఘటనను మియాపూర్ పోలీసులు ఛేదించారు.కూకట్పల్లి డీసీపీ రితి రాజ్ ఇందుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు.
మియాపూర్లో గతేడాది నమోదైన ఓ మిస్సింగ్ కేసు చివరకు దారుణ హత్యగా తేలింది. భర్త ఆస్తి కోసం భార్య తన ప్రియుడితో కలిసి హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మహారాష్ట్రకు తీసుకెళ్లి శవాన్ని తగలబెట్టి, ఏమీ తెలియనట్లు మియాపూర్లో ఫిర్యాదు చేసిన దారుణ ఉదాంతం.మియాపూర్ చెందిన (57) ఏళ్ల మల్లాని పెంటేస్ హత్య కేసును పోలీసులు ఛేదించారు.ఈ కేసులో మృతుడి భార్య మల్లాని సత్యవతి, ఆమె ప్రియుడు మర్రి మధుసూదన్ రెడ్డి, అతని స్నేహితుడు దిద్ది రాజేష్ కుమార్ను అరెస్ట్ చేశారు.
సత్యవతికి మధుసూదన్ రెడ్డితో వివాహేతర సంబంధం ఉంది. భర్త ఆస్తిని దక్కించుకోవాలనే దురుద్దేశంతో హత్యకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది. పథకం ప్రకారం సత్యవతి భర్త అన్నంలో నిద్రమాత్రలు కలిపింది అనంతరం గాఢనిద్రలోకి వెళ్లిన తర్వాత సత్యవతి, మధుసూదన్ రెడ్డి, రాజేష్ కుమార్ కలిసి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.ఆ తర్వాత మృతదేహాన్ని (మహేంద్ర ఎక్స్యువి-500) కారులో మహారాష్ట్రలోని నల్దుర్గ్ పోలీస్ స్టేషన్ పరిధికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు.
ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ఈ ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత... తన భర్త కనిపించడం లేదంటూ సత్యవతే స్వయంగా మియాపూర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.అనంతరం నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయి నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు.
నిందితుల వద్ద నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, నాలుగు తులాల బంగారు గొలుసు,రెండు లక్షల రూపాయల నగదు,అలాగే మృతదేహాన్ని తరలించడానికి ఉపయోగించిన (మహేంద్ర ఎక్స్యువి-500) కారును స్వాధీనం చేసుకున్నారు.మహారాష్ట్రలో లభ్యమైన సగం కాలిన గుర్తుతెలియని మృత దేహం పెంటేస్ ఫీమర్ బోన్ను సేకరించి డీఎన్ఏ పరీక్షలకు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ వ్యవహారాన్ని హత్య కేసుగా మార్చి బి.ఎన్.ఎస్ సెక్షన్లు 103(1), 238, 231,61 కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.






