రామప్ప నుండి గ్రావిటీ ద్వారా నీటిని తరలించాలి
- గణపసముద్రం సరస్సును నింపి సాగునీరు విడుదల చేయాలి
- రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు
- జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకోవాలి
- బిఆర్ఎస్ మండల నాయకుల డిమాండ్
గణపురం,ఆగస్టు 4 (విజయ క్రాంతి): ములుగు జిల్లా రామప్ప సరస్సు నుండి గ్రావిటీ కెనాల్ ద్వారా గణప సముద్రం సరస్సును నింపి మండల కేంద్రంలోని గణపసముద్రం ఆయకట్టుకు తక్షణమే సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు అన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. అధికారుల సూచనలతో అప్పులు చేసి నారుమడులు పోసుకున్న రైతులకు, నాట్ల సమయానికి నీటి సరఫరా నిలిపివేయడం దారుణమన్నారు.
చెరువులో 17 అడుగుల నీరున్నా అధికారుల నిర్లక్ష్యంతో విడుదల చేయడంలేదని మండిపడ్డారు. గతంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హయాంలో రామప్ప నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా గణపురం చెరువుకు నీటిని తరలించారని గుర్తుచేశారు. ప్రస్తుతం రామప్పలో తగినంత నీరున్నా స్థానిక ఎమ్మెల్యే, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. గణపురంలో 90 శాతానికి పైగా కుటుంబాలు ఈ చెరువుపైనే ఆధారపడ్డాయని,
జిల్లా కలెక్టర్ స్పందించి రామప్ప నుంచి గ్రావిటీ ద్వారా గణపసముద్రానికి, అక్కడి నుంచి కాలువల ద్వారా ఆయకట్టుకు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో సరస్సు ఆయకట్టు రైతులతో కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మూతి కరుణాకర్ రెడ్డి, పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, పరశురాంపల్లి సర్పంచ్ ఉడుత సాంబయ్య హఫీజ్, యాదవ్, బొట్ల స్వామి,మార్త శ్రీను, అశోక్ రెడ్డి, జన్నయ్య, సాంబయ్య, గాజర్ల చింటూ గౌడ్, పాసి కంటి రామకృష్ణ, మార్క సాయి, గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






