సొంత నిధులతో మురుగు నీటి సమస్యను తీర్చిన వార్డు మెంబర్
నూతనకల్, మార్చి 22: పాలన అంటే కేవలం పదవిని అనుభవించడం కాదు, ప్రజల కన్నీళ్లను తుడువడమని నిరూపించారు మండల పరిధిలోని మిర్యాల గ్రామానికి చెందిన 10వ వార్డు మెంబర్ కొమ్ము రేణుక పరమేష్. ఎస్సీ కాలనీలోని ప్రజలు గత కొంతకాలంగా నరకప్రాయమైన జీవితాన్ని గడుపుతున్నారు. గతంలో చేసిన సిసి రోడ్ల నిర్మాణం లోపభూయిష్టంగా ఉండటం వల్ల, మురుగు నీరు వెళ్లడానికి దారి లేక రోడ్లపైనే నిలిచిపోయేది.
వర్షం వస్తే ఆ కంపు నీరు ఇళ్లలోకి చేరి చిన్న పిల్లలు, వృద్ధులు అనారోగ్యం పాలవుతున్నా పట్టించుకునే నాథుడే లేకపోయారు. తమ కష్టాలను చూసి చలించిన వార్డు మెంబర్ రేణుక పరమేష్ , సర్పంచ్ అనంతుల శ్రీనివాస్ సూచనలతో రంగంలోకి దిగారు. ప్రభుత్వ నిధులు వచ్చే వరకు వేచి చూస్తే ప్రజల ఇబ్బందులు మరింత పెరుగుతాయని భావించి, తన సొంత నిధులతో మోరి పైపులను తెప్పించారు.
పనుల ప్రారంభోత్సవ సమయంలో ప్రజలు తమ బాధలను చెప్పుకుంటుండగా, ‘ప్రజలకు ఇబ్బంది కలిగితే నేను చూస్తూ ఊరుకోలేను‘ అంటూ ఆయన స్వయంగా పనులను పర్యవేక్షించడం అక్కడి వారిని ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో ఇరుగు వీరస్వామి, కొమ్ము బిక్షం, ఇరుగు దేవయ్య,నాయకపు రమేష్, కొమ్ము రవీందర్, కొమ్ము వెంకటేష్,కొమ్ము సురేష్, కొమ్ము పరమేష్, ఇరుగు జీవన్, కొమ్ము రవి తదితరులు పాల్గొన్నారు.




