బాల్యంపై భారం
పుస్తకాల బరువుతో వంగిపోతున్న చిన్నారులు
చిన్న వయస్సులో వెన్నెముకపై సామర్థ్యాన్ని మించి భారం
అమలుకు నోచుకోని విద్యాహక్కు చట్టం
బోధన్, జూలై 12 (విజయక్రాంతి): బాల్యంపై భారం పెరిగిపోతోంది. వారిని పుస్తకాల బరువు కుంగదీస్తొంది. కిలోల కొద్ది బరువును వీపుపై మోస్తూ అనారోగ్యం భారిన పడాల్సి వస్తోంది. పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తమ లాభాపేక్ష కోసం ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయి.
విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నాయి. అవసరంలేని, అర్హతకు మించిన పుస్తకాలను కొనుగోలు చేయించి విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. వాస్తవానికి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు అసలు పుస్తకాలు ఉండొద్దని చట్టం పేర్కొంటుంది. కానీ ఈ నిబంధనలేవి అమలవడం లేదు. అంతేనా పలు ప్రైవేటు పాఠశాలలు పుణ్యమా అని ఒకటి రెండు తరగతుల విద్యార్థులే 30 నుంచి 45 పుస్తకాలను మోస్తున్నారు.
విద్యార్థులకు తరగతి గదులే సరిపడాలేని పలు పాఠశాలల్లో ఇక లాకర్ల సదుపాయం ఎక్కడ ఉంటుందనే వాదన వినిపిస్తోంది. కానీ ఇలాంటి పాఠశాలలను అధికారులు పట్టించుకోవడంలే దని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మారిన ఫ్యాషన్ పోకడలను అనుసరించి విద్యార్థులు నడుం కిందకు బ్యాగు వేసుకుంటున్నారు. ఇలా వేసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఏడాది అకాడమిక్ క్యాలెండర్ను విడుదల చేసిన ప్రభుత్వం పది బ్యాగ్లెస్ డేస్ను నిర్వహించాలని, నెలలో ప్రతీ మూడో శనివారం నో బ్యాగ్ డేగా పాటించాలని నిర్ణయం తీసుకుంది.
అవసరం లేని పుస్తకాలతో అధికభారం..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరు సబ్జెక్టులకు సంబంధించి ఆరు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు ఉంటాయి. కానీ ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం అందకు విరుద్ధంగా తల్లిదండ్రులపై ఆర్థికభారాన్ని మోపుతూ ఒకటి రెండు తరగతులు చదివే విద్యార్థులకు 10 నుంచి 15 పుస్తకాలు, ఒక్కో సబ్జెక్టుకు వర్క్ బుక్, హోంవర్క్, ప్రాజెక్టు పని ఇలా మూడేసి పుస్తకాలు కొనుక్కోవాలని చెబుతున్నారు. హై స్కూల్ విద్యార్థుల పుస్తకాలు, నోట్ బుక్కులు, మొత్తం 20 నుంచి 25 పుస్తకాలు అవుతుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
కొన్ని పాఠశాలలు ఎక్స్ట్రా కరిక్యులమ్ పేరుతో పలు పబ్లికేషన్స్ రూపొందించిన పాఠ్యపుస్తకాలు కొనుగోలు చేయిస్తున్నాయి. వీటికి లంచ్ బాక్స్, వాటర్బాటిల్ తోడవడంతో నాలుగు నుంచి ఆరు కిలోల బరువవుతోంది. ఈ మోత బాల్యానికి భారం అవుతోంది. దాంతో చిన్నారుల వెన్ను చిన్నవయస్సులోనే వంగిపోతుంది. కాగా అవసరం లేని పుస్తకాలను పక్కన బెట్టి అవసరం ఉన్న పుస్తకాలను వాడుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అత్యధిక భారం వెన్నెముకపై పడి అది దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఇప్పటికే చాలామంది పిల్లలు వంగినడుస్తున్నారన్న అంశం పలు అధ్యయనాల్లో వెల్లడైంది. చిన్న వయస్సులో వెన్నెముకపై సామర్థ్యాన్ని మించి భారం వేయడంవల్ల అనేక సమస్యలు వస్తాయని, వెన్నెముక, మెడనొప్పులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో ప్రత్యేకంగా ర్యాక్లు ఏర్పాటు చేసి హోం వర్క్ కోసం ఉపయోగించే పుస్తకాలనే ఇంటికి పంపించే విధంగా ఏర్పాట్లు చేసినా... అవి కొన్ని పాఠశాలలకే పరిమితమయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న నోబ్యాగ్ డే నిర్ణయాన్ని ప్రైవేట్ పాఠశాలలు ఏ స్థాయిలో అమలు చేస్తాయో వేచిచూడాల్సి ఉంది.






