31 March, 2026 | 8:42 PM

కుటుంబం కోసం సమయాన్ని కేటాయించాలి

31-03-2026 06:57 PM

రామగుండం,(విజయక్రాంతి): తమ కుటుంబ క్షేమం కన్నా సమాజం క్షేమం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులు మాత్రమేనని, ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీస్ అధికారులు తమ కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ సమయం కేటాయించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో సుదీర్ఘకాలంగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను సీపీ మంగళంవారం ఘనంగా సత్కరించారు.

పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులు ఎస్‌ఐ అంజయ్య, ఏఎస్‌ఐలు ఎం. వెంకటస్వామి (1987), సయ్యద్ రాయిస్ అహ్మద్ (1851)లను పోలీస్ కమిషనర్ పూలమాలలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ... ఉద్యోగ విరమణ చేసిన పోలీస్ అధికారులు తమ విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, కొన్ని సందర్భాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలందించినవారని పేర్కొన్నారు.

వీరు రేపటి తరం పోలీసులకు స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు. ఉద్యోగ విరమణ చేసిన అధికారులు తమ ఆరోగ్యం కోసం యోగ లేదా వ్యాయామాన్ని నిరంతరం కొనసాగిస్తూ, ఇకపై కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపి సుఖసంతోషాలతో ఆనందంగా జీవించాలని సీపీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, ఏఓ శ్రీనివాస్, ఆర్ఐలు పెద్దన్న, మల్లేశం, రమేష్, సూపరింటెండెంట్లు ఇంద్రసేనారెడ్డి, సందీప్, సంధ్య, రామగుండం పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బోర్లకుంట పోచలింగం, పదవీవిరమణ పొందిన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.