విద్యార్థుల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు
15-06-2026 12:20 PM
మల్లాపూర్, జూన్ 15(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పాఠశాల పునఃప్రారంభం తొలి రోజున విద్యార్థుల హాజరు నిరాశపరిచింది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారు 180 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, కేవలం 20 మంది మాత్రమే పాఠశాలకు వచ్చారు. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థుల రాక కోసం ఎదురుచూస్తూ కనిపించారు. సోమవారం అమావాస్య కావడంతో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపేందుకు వెనుకంజ వేసినట్లు సమాచారం. రానున్న రోజుల్లో విద్యార్థుల హాజరు పెరుగుతుందని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై విద్యాభ్యాసంపై దృష్టి సారించాలని ఉపాధ్యాయులు సూచించారు.






