మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి
కబ్జాదారులపై చర్యలు తప్పవు
జిల్లా మత్స్య శాఖ డైరెక్టర్ పోతరవేని క్రాంతి
మంథని, జూన్ 15(విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు, మంథని మున్సిపల్ పరిధిలోని అయ్యగారి చెరువు పక్కన ఉన్న ఫిషరీస్ శాఖకు చెందిన భూమిని అధికారులు సర్వే చేశారు. సర్వే నెంబర్ 20లో గల ఒక ఎకరం 38 గుంటల భూమిని మత్స్యశాఖ అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి కొలతలు పూర్తి చేశారు.
ఈ సందర్భంగా మంథని మత్స్యశాఖ అధ్యక్షులు, పెద్దపల్లి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ పోతరవేని క్రాంతికుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి చెందిన ఈ మత్స్యశాఖ భూమిని కొంతమంది కబ్జా కోరులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని గుర్తించామని, వారిని హెచ్చరిస్తున్నామని తెలిపారు. ఇకపై ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అలాగే, ఈ భూమి సర్వే ప్రక్రియ వేగవంతం కావడానికి సహకరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు, మంథని ఆర్డీవో, తహసీల్దార్కు మత్స్యశాఖ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు క్రాంతికుమార్ తెలిపారు.






