12-02-2026 03:24:45 PM
కాన్పూర్: కాన్పూర్ నగరంలోని ధనిక గ్వాల్టోలి ప్రాంతంలో జరిగిన ఘోర లంబోర్గిని ప్రమాదం కేసులో ప్రముఖ పొగాకు వ్యాపారి కె.కె. మిశ్రా కుమారుడు శివం మిశ్రాను గురువారం కాన్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వీఐపీ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. దాదాపు రూ.10 కోట్ల విలువైన ఇటాలియన్ లగ్జరీ స్పోర్ట్స్ కారు, లంబోర్గిని రెవెల్టో అదుపు తప్పి పాదచారులను, ఇతర వాహనాలను ఢీకొన్ని అనంతరం కారు డివైడర్పై ఆగిపోయింది. ఈ సంఘటనలో ఆరుగురు గాయపడగా, అనేక వాహనాలు దెబ్బతిన్నాయని 18 ఏళ్ల ఈ-రిక్షా డ్రైవర్ మహ్మద్ తౌఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఒక రోజు ముందు, డ్రైవర్ అని చెప్పుకుంటున్న మోహన్ అనే వ్యక్తి ప్రమాదం జరిగిన సమయంలో కారు నడుపుతున్నది శివం కాదని చెప్పడంతో కేసు పెద్ద మలుపు తిరిగింది. తన పక్కన కూర్చున్న శివంకు ఢీకొనడానికి కొద్దిసేపటి ముందు నాపై పడ్డాడంతో తను భయాందోళనకు గురై ఒక చేత్తో అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించన్నాని మోహన్ చెప్పాడు. దీంతో కారు మొదట ఓ త్రిచక్ర వాహనాన్ని ఢీకొట్టి, డివైడర్ పైకి ఎక్కి, ఆపై ఆగిపోయిందని మోహన్ అన్నాడు.
కారు ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్ తన నిష్క్రమణను ఆలస్యం చేసిందని, ఆ తర్వాత శివమ్ను డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టి బయటకు దిగానని కూడా అతను పేర్కొన్నాడు. మోహన్ న్యాయవాది కోర్టులో లొంగుబాటు దరఖాస్తు దాఖలు చేయగా, బుధవారం ఆయన అధికారికంగా హాజరయ్యారు. అయితే, గ్వాల్టోలి పోలీసులు తమ నివేదికలో అతని పేరును నిందితుడిగా పేర్కొనలేదు. పోలీసుల వైఖరిని దృష్టిలో ఉంచుకుని, కోర్టు అతని లొంగుబాటును అంగీకరించడానికి నిరాకరించింది. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ నుండి వివరణాత్మక నివేదికను న్యాయస్థానం కోరింది.