ఇళ్ల మధ్య కల్లు దుకాణం తొలగించాలి
ఎర్రవల్లి గ్రామపంచాయతీకి కాలనీ వాసుల పిర్యాదు
ఎర్రవల్లి జూన్ 17: ఎర్రవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నివాస ప్రాంతం మధ్యలో కొనసాగుతున్న కల్లు దుకాణం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దుకాణం వద్ద అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని, పిల్లలు, మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని కాలనీ వాసులు ఆరోపించారు. ఈ మేరకు ఎర్రవల్లి గ్రామ సర్పంచ్ అనితకృష్ణసాగర్ మరియు పంచాయతీ సెక్రటరీ రంగన్నకు కాలనీ వాసులు బుదవారం వ్రాతపూర్వక పిర్యాదు అందజేశారు.
గతంలోనూ పిర్యాదు ఫలితం లేదు కల్లు దుకాణం వల్ల గొడవలు, రాత్రిపూట అల్లర్లు, పరిసరాల్లో చెత్త, సీసాలు పడేయడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వారు పిర్యాదులో పేర్కొన్నారు. ఇదే విషయంపై గతంలో కూడా పంచాయతీకి మౌఖికంగా, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నివాస ప్రాంతం మధ్యలో కల్లు దుకాణం నిర్వహణ నిబంధనలకు విరుద్ధమని, కావున ఆ దుకాణాన్ని తక్షణమే తొలగించి జనావాసాలు లేని వేరే ప్రదేశానికి మార్చాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. పిర్యాదుపై సర్పంచ్ అనితకృష్ణసాగర్ స్పందిస్తూ, విషయాన్ని పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.






