15న హమాలీ మహా గర్జన
- హనుమకొండలో పది లక్షల మందితో నిర్వహణ
- వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాల్సిందే
- హమాలీ వర్కర్స్ యూనియన్ డిమాండ్
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పది లక్షల మంది హమాలీ కార్మికుల హక్కుల సాధన కోసం, వెల్ఫేర్ బోర్డు సాధన కోసం ఈ నెల 15వ తేదీన హనుమకొండలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. సోమవారం హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలం గాణ హమాలి వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎం.ఏ. కలీం, వర్కింగ్ ప్రెసిడెంట్ శివన్న ఇతర నాయకులతో కలిసి హమాలి మహా గర్జన పోస్టర్ను ఆవిష్క రించారు.
రాష్ట్రంలోని కార్మికులందరూ ఏకతాటిపైకి వచ్చి తమ సత్తా చాటాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో హమాలీల కష్టాలను గుర్తించి హమాలి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన పాలకులు, అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్నే మరిచిపోయారని మండిపడ్డారు.
వెల్ఫేర్ బోర్డు ద్వారా ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, వృద్ధా ప్య పెన్షన్ ,వారి పిల్లల విద్యా సహాయం వంటి పథకాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ దశమ వార్షికోత్సవ మహాసభను పురస్కరించు కుని 15న హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో హమాలి మహా గర్జనకు తరలిరావాలని కోరారు.




