అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే లక్ష్యం
కూసుమంచి మండలంలోని రాజుపేట, గట్టు సింగారం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి
కూసుమంచి, జూన్ 8(విజయక్రాంతి) : ప్రతి అర్హులైన పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. సోమవారం కూసుమంచి మండలంలోని రాజుపేట, గట్టు సింగారం గ్రామాల్లో పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తోందన్నారు. కేవలం ఇళ్ల మంజూరుతోనే బాధ్యత ముగిసిపోయిందని భావించకుండా నిర్మాణ పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రతి సోమవారం బిల్లులు విడుదల చేస్తున్నామని తెలిపారు. రాజుపేట గ్రామంలో వనాపురం సుభద్ర, దాసరి భద్రయ్య, కోట వీరారెడ్డి, సండ్ర ఎల్లమ్మ, గట్టు సింగారం గ్రామంలో గుంటి దుర్గా, గుడిపల్లి వెంకట నరసమ్మ, దివ్వల రమేష్, గుడిపల్లి జ్యోతి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
రాజుపేట గ్రామంలో మంజూరైన గృహాల్లో నాలుగు పూర్తయ్యాయని, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయని, గట్టు సింగారం గ్రామంలో 19 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, ఇప్పటికే 10 ఇళ్లు పూర్తు గృహ ప్రవేశాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఈ లక్ష్యంతోనే రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించా మని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మరో రెండు వేల మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.
అర్హులైన చివరి లబ్ధిదారుడికి కూడా ఇందిరమ్మ ఇల్లు అందే వరకు దశల వారీగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇల్లు లేని పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. నూతనంగా ఇళ్లు నిర్మించుకుని గృహప్రవేశం చేసిన కుటుంబాలకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఇంట్లో సుఖ సంతోషాలతో, ఆత్మగౌరవంతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస్, సంబంధిత జిల్లా అధికారులు, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ సైదులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.






