సోషల్ మీడియాకు సమన్లు
- అన్ని ప్లాట్ఫారమ్లు వచ్చేనెల 3న హాజరవ్వాలి
- ఆదేశించిన పార్లమెంటరీ ప్యానెల్
న్యూఢిల్లీ, జూలై 28: సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫారమ్ల నియంత్రణపై చర్చించేందుకు, ఇన్స్టాగ్రామ్తో సహా ప్రధాన సామాజిక మాధ్యమాల ప్రతినిధులకు మంగళవారం పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు జారీ చేసింది. వీరితో పాటు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హోం శాఖల అధికారులను ఆగస్టు 3న సాయంత్రం 4 గంటల లోపు హాజరు కావాలని ఆదేశించింది.
ఈ మేరకు కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి అధ్యక్షత వహిస్తున్న బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే వెల్లడించారు. మహిళలు, పిల్లలు, రైతులు, గ్రామీణులు, కార్మికులు, సాధారణ ప్రజల గోప్యతను ఎలా పరిరక్షిస్తారు? ప్రజా శాంతిభద్రతలను ఎలా నిర్ధారిస్తారు? అనే దానిపై వివరించడానికి మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్), గూగుల్, ఎక్స్, స్నాప్చాట్ ప్రతినిధులకు ప్యానెల్ సమన్లు ఇచ్చిందని ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు.






