రైతుల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటం ఆడుతుంది
- బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వ లక్ష్మి నర్సయ్య
మంచిర్యాల, మే 7 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వ లక్ష్మి నర్సయ్య పేర్కొన్నారు. అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, లక్షెట్టిపేట మండలంలో చనిపోయిన నలుగురు రైతులకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రధాన రహదారిపై గురువారం చేపట్టిన రైతు ధర్నా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ లతో కలిసి మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం తరుగు పేరుతో రైతులు పండించిన ధాన్యాన్ని బస్తాకు నాలుగు కిలోల చొప్పున దోచుకుంటుందని, కాంట పెట్టిన ధాన్యాన్ని లారీల కొరతతో తరలించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేలు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై కమీషన్ల కోసం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.
ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో బిజెపి నాయకులు దుర్గం అశోక్, కొయ్యల ఎమాజీ, కోడి రమేష్, గోపతి రాజన్న, అమిరిశెట్టి రాజ్ కుమార్, కుర్రె చక్రి, సత్రం రమేష్, రంగ శ్రీశైలం, వీరమల్ల హరి గోపాల్, నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, కోడి రమేష్, పట్టి వెంకట కృష్ణ, కమలాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు






