దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం
- కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట,(విజయక్రాంతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం, ధైర్యసాహసాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. దొడ్డి కొమురయ్య వర్ధంతిని జిల్లా కలెక్టరేట్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెట్టిచాకిరీ, సామాజిక దోపిడీ, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి తెలంగాణ ప్రజల స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారన్నారు.
సమాజంలో సమానత్వం, న్యాయం, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన త్యాగాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలంగాణ చరిత్రలో రైతాంగ సాయుధ పోరాటానికి దొడ్డి కొమురయ్య చేసిన త్యాగం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. మహనీయుల ఆశయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరి సింగ్,జిల్లా రెవెన్యూ అధికారి ప్రేమ్ రాజ్, బీసీ వెల్ఫేర్ అధికారి విశాల్, ఉప్పల రమేష్ గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి కంచకట్ల శ్రీనివాస్, సహాయ కార్యదర్శి, మన్యం యాదగిరి, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, కుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






