అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం
పద్మశ్రీ చింతకింది మల్లేశంకు గౌరవ డాక్టరేట్ ప్రదానం
ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ విశ్వవిద్యాలయం శనివారం 3వ వార్షిక స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. అలాగే ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, సైన్సెస్, వ్యవసాయ విభాగాలకు చెందిన మొత్తం 2,789 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈసంవత్సరం పట్టభద్రులలో 2,193 మంది బి.టెక్ విద్యార్థులు ఉండగా, 44 మంది పరిశోధకులకు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్డీ) పట్టాలు ప్రదానం చేశారు.
అదనంగా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) 155 మంది, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) 90 మంది, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ (బీ.ఫార్మ్) 88 మంది, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) 74 మంది, అలాగే ఫార్మసీ, టెక్నాలజీ, వ్యవసాయం, మేనేజ్మెంట్ రంగాలకు చెందిన పలు పీజీ, డాక్టోరల్ కోర్సుల విద్యార్థులకు కూడా పట్టాలను ప్రదానం చేశారు. చేనేత రంగంలో తన వినూత్న ఆవిష్కరణతో వేలాది మంది చేనేత కార్మికుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన ప్రముఖ సామాజిక ఆవిష్కర్త పద్మశ్రీ చింతకింది మల్లేశంకు విశ్వవిద్యాలయం డాక్టరేట్ ను ప్రదానం చేసింది.
2026 బ్యాచ్ పట్టభద్రులను ఉద్దేశించి అనురాగ్ విశ్వవిద్యాలయం చైర్మన్, జనగామ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సీఐఐ చైర్మన్, రీ సస్టైనబిలిటీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌతమ్ రెడ్డి, అనురాగ్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ యు.బి. దేశాయ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయానికి డీన్లు, విభాగాధిపతులు, డైరెక్టర్లు, పరీక్షల నియంత్రణాధికారి, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది కూడా పాల్గొన్నారు. పట్టభద్రులను అభినందించిన విశ్వవిద్యాలయం వారు తమ భవిష్యత్తు జీవితంలో ఉన్నత విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తూ, జీవితాంతం నేర్చుకునే దృక్పథంతో పాటు సమాజానికి, దేశానికి బాధ్యతాయుతమైన పౌరులుగా సేవలందించాలని శుభాకాంక్షలు తెలిపింది.






