2 July, 2026 | 1:54 AM

భరత్ తివారీ ఎన్‌కౌంటర్ సుప్రీం తీరు న్యాయవ్యవస్థకు మచ్చ

02-07-2026 12:42 AM

ఖైరతాబాద్, జూలై 1 (విజయక్రాంతి): జూన్ 17న బీహార్ లోని బిలౌటి గ్రామానికి చెందిన భరత్ భూషణ్ తివారీ అనే వ్యక్తిని స్థానిక పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. జగదీష్ పూర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ను బెదిరిస్తూ అతను సోషల్ మీడియాలో పోస్టు చేసిన నేపథ్యంలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు ఆరోపణలున్నాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది. పోలీసులు చట్టాన్ని అతిక్రమించి తివారీని హత్య చేశారని, దానిపై సీబీఐ విచారణ జరపాలని పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో సుప్రీం తీరును హిందూ రక్షా సమితి ఖండించింది. పిటిషన్ ను కనీసం విచారించకుండా దాన్ని తిరస్కరించడాన్ని తప్పుబట్టింది. ఇది న్యాయవ్యవస్థకు మాయని మచ్చ అని ఆరోపణలను గుప్పించింది.

ఈ విషయమై హిందూ రక్షా సమితి తెలంగాణ కన్వీనర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరుకు పది సూత్రాలతో కూడిన వినతి పత్రాన్ని బుధవారం సమర్పించారు. అనంతరం ప్రశాంత్ మాట్లాడుతూ సోషల్ మీడియా పోస్టులపై కేసు నమోదు చేసిన తరువాత భరత్ తివారీ పోలీసులకు లొంగిపోయాడన్నారు. అయినప్పటికీ చట్టాన్ని అతిక్రమించి అతన్ని ఎన్ కౌంటర్ చేశారని విమర్శించారు. సుప్రీంకోర్టు ఈ ఘటనపై విచారణను కనీసం అర్హమైనదిగా గుర్తించకపోవడం పట్ల విచారణం వ్యక్తం చేశారు.

అందుకే న్యాయం కోసం తాము రాష్ట్రపతిని ఆశ్రయిస్తున్నామన్నారు. దోషులైన పోలీసులకు శిక్షపడే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తామన్నారు. బాధిత కుటుంబానికి వెంటనే రూ.5కోట్ల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని అవహేళన చేసేలా వ్యవస్థలు వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి ముప్పు తెస్తోందన్నారు. బీహార్ ప్రభుత్వ నిరంకుశత్వానికి కాలమే సమాధానం చెబుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జి.సురేశ్ కుమార్, కె.సాయికృష్ణ, సునీల్ కుమార్, మహేశ్, నవీన్ కుమార్ గౌడ్, కిరణ్ కుమార్ రెడ్డి, ప్రకాశ్, హిందూ రక్షా సమితి కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.