రాయదుర్గం భూముల వేలంపై స్టే!
- ఈ-వేలం వ్యవహారంలో కీలక మలుపు
- ఎస్బీఐ పిటిషన్పై హైకోర్టు విచారణ
- మూడు వారాలు స్టే విధిస్తూ ఉత్తర్వులు
- ప్రభుత్వం, టీజీఐఐసీ, గౌర వెంచర్స్కు నోటీసులు
- సర్కారు తీరుపై ధర్మాసనం అసహనం
- ఎస్బీఐకి కేటాయించారని తెలీదా?, ఏకారణంతో వేలం వేశారని ఆగ్రహం
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి) : హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని రాయదుర్గంలో ఉన్న అత్యంత విలువైన భూముల (సర్వే నంబర్ 83/1) ఈ-వేలం వ్యవహారం కీలక మలుపు తిరిగింది. మూడు వారాల పాటు స్టే విధిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని టీజీఐఐసీ, రాష్ట్ర ప్రభుత్వం, గౌర వెంచర్స్ తదితర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
వేలం వేసిన భూమిలో కొంతభాగం (6.29 ఎకరాల్లో 5 ఎకరాలు) చట్టబద్ధంగా తమకు చెందుతుందని పేర్కొంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హైకోర్టులో రెండు వేర్వే రు రిట్ పిటిషన్లు దాఖలు చేసింది. ఈ భూమి ని 2010లో అప్పటి ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్)కు కేటాయించింది. ఇందుకోసం రూ.13.33 కోట్లు చెల్లించినట్లు బ్యాంకు పేర్కొంది. అనంతరం ఎస్బీఐలో ఎస్బీహెచ్ విలీనమైంది.
ఎస్బీహెచ్ స్థలంలో ఉన్న రెండు ఏటీఎంలను ప్రస్తుతం ఎస్బీఐ నిర్వహిస్తోంది. అయితే 2020లో అప్పటి ప్రభుత్వం భూ కేటాయింపును రద్దు చేయగా ఎస్బీఐ కోర్టును ఆశ్ర యించింది. ఆ సమయంలో కేటాయింపు రద్దు ఉత్తర్వులను కొట్టివేసిన న్యాయస్థానం, ఎస్బీఐ అభ్యర్థన ను పునఃపరిశీలించాలని ఆదేశించింది.
అనంతరం 2024లో ప్రస్తుత ప్రభుత్వం కూడా కేటాయింపును రద్దు చేయడంతో ఎస్బీఐ మరోసారి కోర్టును ఆశ్రయించింది. ఇటీవల జరిగిన వేలంలో ఈ భూమి ఎకరానికి సుమా రు రూ.237 కోట్ల ధర పలకడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదే భూమిలో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేయడం పట్ల ఎస్బీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇరుపక్షాలమధ్య వాడీవేడి వాదనలు
ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్పై గురవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృ త్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కోర్టులో ఇరుపక్షాల మధ్య వాడీవేడి వాదనలు చోటుచేసుకున్నా యి. ప్రభుత్వం తరఫున హాజరైన అడిషనల్ అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) ధర్మాసనం ముందు గట్టి వాదనలు వినిపించారు.
2010 లో టీజీఐఐసీతో కుదిరిన ఒప్పందం ప్రకారం రెండేళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉందని, దాదాపు 16 ఏళ్లు గడిచినా ఎస్బీఐ ఎలాంటి పనులు చేపట్టలేదని వాదించారు. ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించినందునే భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని వేలానికి పెట్టాల్సి వచ్చిందని కోర్టుకు వివరించారు.
‘రియల్’ వ్యాపారాన్ని పరుగులు పెట్టించాలనుకున్నారా?
విచారణ సందర్భంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలపై ధర్మాసనం తీవ్ర అసహ నం, ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరు ను తప్పుబట్టింది. ‘అసలు ఏ కారణంతో ఆ భూమిని వేలం వేశారు?. అది ఎస్బీఐకి కేటాయించిన భూమి అని ప్రభుత్వానికి తెలీ దా?. ఆ భూమి ఎస్బీఐకి కేటాయించిందన్న విష యం తెలిసి కూడా ఎలా వేలం వేశారు?’ అని ప్రశ్నించింది. ఒక ప్రభుత్వ సంస్థకు కేటాయించిన భూమిని మరోసారి వేలం వేయడం ఎలా సమర్థించగలరు? అని ప్రభుత్వాన్ని నిలదీసింది.
అంతేకాకుండా, భూములను వేలం వేస్తూ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పరుగులు పెట్టించాలనుకుంటున్నారా? అం టూ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. దీనికి ప్రతిస్పందించిన ఏఏజీ, భూముల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పను ల కోసం వినియోగిస్తోందని వివరించారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం భూముల వేలంపై మూడు వారాల పాటు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోనే అత్యంత విలువైన రాయదుర్గం భూముల వివాదం ఇప్పుడు న్యాయపరమైన పోరాటంగా మారింది. హైకోర్టు తుది తీర్పు ఈ భూముల యాజమాన్యంపైనే కాకుండా, భవిష్యత్తులో ప్రభుత్వ భూ కేటాయింపులు, రద్దులు, వేలం ప్రక్రియలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.






