ఓటరు జాబితా సవరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణరావు
పెద్దపల్లి, జూలై 27 (విజయక్రాంతి): పెద్దపల్లి పట్టణంలో చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని కలిసికట్టుగా విజయవంతం చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పిలుపునిచ్చారు. సోమవారం పెద్దపల్లి పురపాలక (మున్సిపల్) కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.పట్టణంలోని 36 వార్డుల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఓటర్ల సవరణ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అలాగే, జెండా చౌరస్తా నుంచి మసీదు చౌరస్తా వరకు ఉన్న ప్రధాన రహదారిని వ్యాపారుల కోరిక మేరకు 55 అడుగుల వెడల్పుతో, భూగర్భ మురుగునీటి కాలువలు, వీధి దీపాల సదుపాయాలతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. అంతకుముందు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పురపాలక అధ్యకక్షుడు (ఛైర్మన్) నూగిళ్ల మల్లయ్య, కమిషనర్ ఆకుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.






