చితికి చేరిన తమ్ముడికి రాఖీ కట్టిన అక్కలు
- తమ్ముడికి అక్కల అంతిమ కన్నీటి వీడ్కోలు
- రాఖీ పౌర్ణమి రోజున హృదయ విదారక ఘటన
- తమ్ముడి పార్థివదేహానికి రాఖీ కట్టిన అక్కలు
గండీడ్, ఆగస్టు 28 : పుట్టింటికి పిలవకుండానే ఆడబిడ్డలు వచ్చే సందర్భం ఏదైతే ఉంది అంటే అది కేవలం రాఖీ పండుగ కు మాత్రమే సొంతం. అలాంటిది ఈసారి కూడా తన తమ్ముడు పిలవకముందే తమ అమ్మగారి ఇంటికి చేరుకొని రాఖీ కడదాం అనుకున్న అక్కలకు తమ్ముడి మరణవార్త తో ఆహ్వానం పలికేలా రాఖీ పండుగ కన్నీళ్లు తెప్పించింది. ఆకస్మిత్తుగా మరణించిన తన తమ్ముడు చేతికి రాఖీలు కడుతూ ఆ అక్కలు కన్నీరు పెట్టుకుంటున్న సంఘటన అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పించింది.
తమ్ముడితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ బరువెక్కిన హృదయంతో అంతిమ వీడ్కోలు పలికారు. వివరాలు ఇలా ఉన్నాయి..మండల పరిధిలోని మన్సూర్పల్లి గ్రామానికి చెందిన ఎదుల చిన్న చెన్నప్ప (82) గురువారం రాత్రి మృతి చెందారు. రాఖీ పౌర్ణమి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
చిన్న చెన్నప్పకు అక్కలైన బోయిని బుగ్గమ్మ, చౌదరి బుగ్గమ్మ తమ్ముడి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. జీవితంలో ఎన్నో రాఖీలు తమ్ముడి చేతికి కట్టిన ఆ అక్కలే.. ఈసారి తమ్ముడి పార్థివదేహానికి రాఖీ కడుతు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమ్ముడితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ బరువెక్కిన హృదయంతో అంతిమ వీడ్కోలు పలికారు.






