అమెరికాలో రోడ్డు ప్రమాదం
రంగారెడ్డి జిల్లా వాసి దీపా దుర్మరణం
ఆమనగల్లు, జూలై 27 (విజయక్రాంతి): అమెరికాలోని న్యూజెర్సీలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందారు. మాడుగుల మండల కేంద్రానికి చెందిన పట్టాభి శేఖర్ రెడ్డి, శశిరేఖ దంపతుల కూతురు శ్రీపాతి దీపా (44)కు 20 ఏళ్ల క్రితం ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లికి చెందిన రామకృష్ణారెడ్డితో వివాహమైంది. వృత్తిరీత్యా ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కావడంతో గత కొన్నేళ్లుగా అమెరికాలోని న్యూజెర్సీలో నివాసముంటున్నారు.
సోమవారం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దీపా మృతి చెందినట్లు కుటుంబం సభ్యులు తెలిపారు. బాధితురాలి బంధువులు, ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ఎన్ఆర్ఐ ప్రతినిధులు, ప్రభుత్వం, సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నారు.






