11-02-2026 12:00:00 AM
కలెక్టర్ జితేష్ వి. పాటిల్
ఇల్లెందు, ఫిబ్రవరి 10, (విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం ఆయన ఇల్లందు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఔషధాల పంపిణీ విభాగం, రక్త పరీక్ష కేంద్రం, ఇన్పేషెంట్ వార్డులు, గర్భిణీ స్త్రీల వార్డు, గైనిక్ వార్డు, ఎక్స్రే గది, స్టోర్ రూమ్ తదితర విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. ఆయా విభాగాల్లో ఉన్న సదుపాయాలు, నిర్వహణ తీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అలాగే ఇన్పేషెంట్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలు సేకరించారు. ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బర్త్ వెయిటింగ్ రూమ్ను సందర్శించిన కలెక్టర్, మిగిలిన పనులను వేగవంతం చేసి తక్షణమే ప్రజల వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.
ఆసుపత్రికి అవసరమైన వైద్య సామాగ్రి, మరమ్మతులు, పరికరాల రిన్యూవల్కు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రికి సూపర్డెంట్ హర్షవర్ధన్, ఆర్ ఏం ఓ రామ్ నివాస్, నర్సింగ్ సూపర్డెంట్ జయ, హెడ్ నర్స్ ఫర్ జానా, నర్సులు భవాని, భారతి, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.