18 July, 2026 | 1:24 AM

దేవాదాయ శాఖలో 191 నియామకాలు

18-07-2026 01:16 AM

యాదగిరిగుట్ట 54, వేములవాడలో 21 మందికి నియామక పత్రాలు అందజేత

యాదాద్రి భువనగిరి/ వేములవాడ, జూలై 17 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్రవ్యాప్తంగా 191 పోస్టులను భర్తీ చేస్తూ నియామక పత్రాలను అందజేసింది. హైద్రాబాద్‌లోని రవీంద్ర భారతిలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులకు దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ ఎం.హనుమంతరావులు నియామక ఉత్తర్వులను అందజేశారు.

రాష్ట్రవ్యాప్తంగా భర్తీ చేసిన 191 పోస్టుల్లో యాదగిరిగుట్ట దేవస్థానం 54, వేములవాడ దేవస్థానానికి 21 పోస్టుల భర్తీ కాగా.. మిగిలినవి ఇతర  దేవస్థానాల్లో భర్తీ చేశారు. దాదాపు 14 సంవత్సరాల తరువాత నియామకాలు చేపట్టడం విశేషం.    

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని 12 విభాగాల్లో  54 పోస్టులకు నియామక పత్రాలను అందజేసింది. వీటిలో  పరిచారకులు (ప్రధాన ఆలయం) -19, పరిచారిక (శివాలయం)- 5, వేదపండిత్ (అథర్వణ వేదం) -1, పురోహిత్ (వాహన పూజలు) -1, సహాయ పాచక (రామానుజకుటం)- 11, సహాయ పాచక (బ్రాహ్మణ సత్రం) -2, సహాయ పాచక (ప్రసాద విక్రయం) - 6, సహాయ పాచక (అన్నదానం) -4, డోలు -1, సన్నాయి -2, శృతి -1, తాళం -1 పోస్టులు ఉన్నాయి. కాగా నూతనంగా నియామక అందుకున్న వారికి ఆలయ ఈవో జై భవాని శంకర్ శుభాకాంక్షలు తెలిపారు.

వేములవాడ రాజన్న ఆలయానికి 21 ఉద్యోగాలు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి 21 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టుల్లో 11 పరిచారకులు, ఇద్దరు వైష్ణవ అర్చకులు, ఇద్దరు తమ్మల అర్చకులు, ఒక అసిస్టెంట్ కుక్, ఒక శృతి వాద్యకారుడు, ఇద్దరు డోలు వాద్యకారులు, ఇద్దరు సన్నాయి వాద్యకారులు ఉన్నారు.

వేములవాడ దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి పాల్గొని అభ్యర్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ధార్మిక సలహాదారు గోవింద హరి, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజ్ శ్రీనివాస్, యాదగిరిగుట్ట దేవస్థానం కార్యనిర్వాహణాధికారి భవాని శంకర్, ఎస్‌ఐటీఏ డైరెక్టర్ డాక్టర్ విజయ రాఘవాచార్యులు పాల్గొన్నారు.