18 July, 2026 | 2:07 AM

ఉద్యోగులకు హెల్త్ స్కీం.. నూతన అధ్యాయం

18-07-2026 01:55 AM
  1.    8 లక్షల మందికి నగదురహిత వైద్యం 
  2.    886 ఆస్పత్రుల్లో 1,816 రకాల చికిత్సలు 
  3. ఉద్యోగులను గత ప్రభుత్వం పట్టించుకోలేదు 
  4. రూ.10 వేల కోట్ల పాత బిల్లులు చెల్లిస్తున్నాం 
  5. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
  6. మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ‘ఎన్‌ఈహెచ్‌ఎస్’ ప్రారంభం

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలకు భరోసా కల్పించే లక్ష్యం తో ప్రజాప్రభుత్వం న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఎన్‌ఈహెచ్‌ఎస్) ప్రవేశపెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆందోళనలు లేకుం డా మెరుగైన ఆరోగ్య భద్రత అందించడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. గత ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్ స్కీం, ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.

వైద్య ఖర్చు ల కోసం ఉద్యోగులు, వారి కుటుంబాలు అప్పులపాలవుతున్న పరిస్థితులను తమ ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఎన్‌ఈహెచ్‌ఎస్ ద్వారా సుమారు 8 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన 29.80 లక్షల మంది కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. రాష్ర్టంలోని 886 నెట్‌వర్క్ ఆస్ప త్రుల్లో సీజీహెచ్‌ఎస్ ప్యాకేజీల కింద 1,816 రకాల చికిత్సలు నగదురహితంగా అందనున్నాయని వెల్లడించారు.

శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో వైద్యారో గ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్టు బోర్డు సభ్యులు, ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి ఎన్‌ఈహెచ్‌ఎస్‌ను ప్రారంభించారు. ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, నాయకులు పుల్గం దామోదర్ రెడ్డి, చావా రవి, సదానందంగౌడ్, వంగ రవీందర్‌రెడ్డి, కటకం రమేష్, లచ్చిరెడ్డి, కృష్ణయాదవ్ తదితరులకు డిజిటల్ హెల్త్ కార్డులు అందజేశారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉద్యోగులకు సంపూర్ణ నగదు రహిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రేమ, చిత్తశుద్ధికి ఈ పథకమే నిదర్శనమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మానవీయ కోణంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

ఉద్యోగులు కూడా మన కుటుంబ సభ్యులేనని, వారి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనే సదుద్దేశంతో  సీఎం రేవంత్‌రెడ్డి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ కమిటీకి తాను చైర్మన్‌గా, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నామని, దాని ప్రతిరూపమే ‘న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్’ అని వివరించారు.

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్) ప్యాకేజీ రేట్లకు అనుగుణంగా 1,816 రకాల వైద్య, శస్త్రచికిత్సలను ‘ఎన్‌ఈహెచ్‌ఎస్’ కవర్ చేస్తుందని వివరించారు. ఈ పథకం పారదర్శకంగా, సజావుగా సాగేందుకు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమాన భాగస్వామ్యంతో ఒక ప్రత్యేక ’ట్రస్ట్’ ను ఏర్పాటు చేశామన్నారు.

గత పాలకుల నిర్లక్ష్యంతోనే..

గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు తమ ఆరోగ్య భద్రత కోసం సకలజనుల సమ్మెతో సహా ఎన్నో పోరాటాలు చేసినా ఫలితం దక్కలేని, విజ్ఞప్తులను బుట్టదాఖలు చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రూ 10 వేల కోట్ల బకాయిలను నెలకు రూ.2 వేల కోట్ల చొప్పున తమ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.  ఈ పథకాన్ని ప్రతి 15 రోజులకోసారి తానే స్వయంగా సమీక్షిస్తూ ఒక్క రూపాయి కూడా మెడికల్ బిల్లులు పెండింగ్ లేకుండా చూస్తున్నానని స్పష్టం చేశారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచామని, అర్హులైన 1.06 కోట్ల కుటుంబాలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం ఇంతటి చిత్తశుద్ధితో పనిచేస్తున్న నేపథ్యంలో, ప్రతి ఉద్యోగి రెట్టింపు ఉత్సాహం, నిబద్ధతతో పనిచేయాలని డిప్యూటీ సీఎం కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరి డా.క్రిస్టినా జడ్ చోంగ్తూ, విద్యాశాఖ సెక్రటరి యోగితరాణా, స్పెషల్ ఛీఫ్ సెక్రటరి జీఏడి మహేష్ దత్ ఎక్కా, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరి సందీప్ కుమార్ సుల్తానియా, ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు బి.శ్యామ్, మధుసూదన్ రెడ్డి, బిక్షం గౌడ్, సత్యనారాయణ రెడ్డి, ఉమా, ఎం.అంజిరెడ్డి, అనిల్ కుమార్, వెంకట్, వొడ్నాల రాజశేఖర్, పర్వతి సత్యనారాయణ, పర్వత్ రెడ్డి, ప్రేమ్ తదితర ఉద్యోగ సంఘాల నాయకులు, నెట్‌వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. 

అత్యాధునిక వైద్యం : మంత్రి దామోదర రాజనర్సింహ

ఎన్‌ఈహెచ్‌ఎస్ ద్వారా ఉద్యోగులకు అపోలో, కిమ్స్, మెడికవర్ వంటి కార్పొరేట్ హాస్పిటళ్లలోనూ క్యాష్‌లెస్ వైద్యం అందనున్నదని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. పేద ప్రజలకు అత్యాధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్‌ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అమలు చేసిందన్నారు. గతంలో అమలులో ఉన్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌లో ప్యాకేజీ రేట్లు తక్కువగా ఉండటంతో అనేక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ భాగస్వామ్యం కావడం లేదని, క్లెయిమ్‌ల పరిష్కారంలో జాప్యం, ఉద్యోగుల ప్రాతినిధ్యం లేకపోవడం, ప్యాకేజీల సవరణలో పరిమితులు వంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు.

వాటన్నింటికీ శాశ్వత పరిష్కారంగా ఈ కొత్త పథకాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఎన్‌ఈహెచ్‌ఎస్‌ను అమలు చేస్తున్నామని తెలిపారు. డిజిటల్ హెల్త్ కార్డులను వెబ్ పోర్టల్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12 వెల్‌నెస్ సెంటర్ల ద్వారా రోజూ సుమారు 1,800 మందికి ఔట్ పేషెంట్ సేవలు అందుతున్నాయని, త్వరలో మరో 24 వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. 

ఉద్యోగుల కల నెరవేరింది 

ఉద్యోగుల కల నెరవేరింది. దీని కోసం 20 ఏళ్లుగా ఎదురుచూశాం. ఉద్యోగ జీతాల నుంచి 1.5 శాతం వాటా, అంతే మేరకు ప్రభుత్వం కూడా తన వాటా ఇచ్చి నగదు రహిత వైద్యం అందిచడం శుభపరిణామం. హెల్త్ స్కీం అమలుతో ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. ఉద్యోగులు బాగుంటేనే పనిపై దృష్టిసారించే వీలుంటుంది. తమ విజ్ఞప్తులను గౌరవించి హెల్త్ కార్డులను జారీ చేసినందుకు సీఎం, డిప్యూటీసీఎం, క్యాబినెట్‌కు ధన్యవాదాలు.

 మారం జగదీశ్వర్, 

ఉద్యోగులు జేఏసీ చైర్మన్

సీఎంను కలవగలుగుతున్నాం

ఈ ప్రభుత్వంలో సీఎంను, డిప్యూటీ సీఎంను, ఉన్నతాధికారులను నేరుగా కలిసి తమ సమస్యలను చెప్పుకోగల్గుతున్నాము. మా సమస్యలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుంది. 64 సమస్యల్లో 34 సమస్యలు పరిష్కరించింది. పెండింగ్ బిల్లులను ప్రతినెలా రూ.2 వేల కోట్ల చొప్పున విడుదల చేయాలి. ఉద్యోగులంతా ఓ గంట అదనంగా పనిచేస్తాం. సంక్షేమపథకాలను ప్రజలకు చేర్చుతాం. ఉద్యోగులు హెల్త్ కార్డుపై అపోహలు పెట్టుకోవద్దు.  

 ఏలూరి శ్రీనివాసరావు, 

ఉద్యోగుల జేఏసీ సెక్రటరీ జనరల్