10 July, 2026 | 7:26 PM

ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలి

10-07-2026 06:10 PM

మెట్ పల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వం అమలు చేస్తున్న జి.ఓ. నెం. 25లోని నిబంధనలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి, నాణ్యమైన విద్య అందించడానికి అనుకూలంగా లేవని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి జరుపుల గోవింద్ తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం అమలులో ఉన్న ఉపాధ్యాయ పోస్టుల విధానం విద్యార్థుల విద్యా అవసరాలను సమర్థవంతంగా తీర్చలేకపోతోందన్నారు. అందువల్ల విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తిని 1:20గా నిర్ణయిస్తూ జి.ఓ. నెం. 25ను ప్రభుత్వం తక్షణమే సవరించాలని వారు డిమాండ్ చేశారు.అలాగే ఉపాధ్యాయ పోస్టులతో పాటు ఒక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోస్టు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల భవిష్యత్తు, విద్యార్థుల విద్యా హక్కు, నాణ్యమైన విద్యను పరిరక్షించే దిశగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుని జి.ఓ. నెం. 25లో తక్షణ సవరణలు చేపట్టాలని టీజీయూఎస్ జగిత్యాల జిల్లా నాయకులు కోరారు.