రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
పాపన్నపేట: ఆటో అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న ఘటనలో తీవ్ర గాయాలై ఒకరు మృతి చెందిన సంఘటన పాపన్నపేట గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. పాపన్నపేట గ్రామానికి చెందిన ఆరె కటికె మోహన్(53) ఏడుపాయల్లో మేకల కట్టింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం ఏడుపాయలకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.
ఏడుపాయలకు వెళ్లి ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా పాపన్నపేట శివారుకు రాగానే ఇతను ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న మోహన్ కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య రాజమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.




