పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా: ఎంపీ కడియం కావ్య
వరంగల్,(విజయక్రాంతి): పేదల ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, 10 లక్షల రూపాయల కు ఆరోగ్యశ్రీ పరిమితి పెంచడంతోపాటు అనారోగ్యానికి గురైన వారికి ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తుందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య చెప్పారు. హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ అనే బాలుడు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుండగా, అతని చికిత్స కోసం వరంగల్ ఎంపీ కావ్య ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రభుత్వం నుండి 4 లక్షల రూపాయల ఎల్ ఓ సి మంజూరు చేయించారు. మంజూరైన ఎల్ ఓ సీ పత్రాన్ని మంగళవారం కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపత్కాలంలో తమకు ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచిన వరంగల్ ఎంపీ కావ్యకు బాధిత కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.






