14 March, 2026 | 9:58 PM

మహిళలు పురుషులతో సమానంగా ఎదగాలి

14-03-2026 06:09 PM

ఆర్థికంగా వారి సొంతకాళ్లపై  నిలబడాలి

మహిళా సంఘాలుగా ఏర్పడితే ప్రభుత్వం ద్వారా రుణాలు ఇస్తాం

 మూసి ప్రక్షాళనకు ప్రతిపక్షాలు అడ్డుపడొద్దు

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ టౌన్: మహిళలను పురుషులతో సమానంగా, ఆర్థికంగా ఎదిగేలా చురుకుగా తయారు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని సెట్విన్ సంస్థలో కుట్టు మిషన్ల ద్వారా శిక్షణ పొందిన 116 మంది మహిళలకు కుట్టు మిషన్లను, సర్టిఫికెట్లను పంపిణీ సందర్భంగా మాట్లాడుతూ... మహిళలు ఎవరు ఖాళీగా ఉండవద్దని, పట్టుదలతో ఏదో ఒక కోర్సులో శిక్షణ పొంది స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.

జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సెట్విన్ శిక్షణ సంస్థ ను రాష్ట్రంలోనే నంబర్ వన్ సంస్థగా తీర్చిదిద్దాలన్నారు. ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు 27 కోర్సులలో 1250 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని,  శిక్షణ పొందిన మహిళలు సంఘాలుగా ఏర్పాటయితే వారు స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం ద్వారా రుణాలు ఇప్పిస్తామని, స్కూలు విద్యార్థుల యూనిఫాం కుట్టే పనిని సంఘాలకే అప్పచెబుతామని తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయం వద్ద న్యాక్ శిక్షణ సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా శిక్షణ ఇస్తున్నామని, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణంలో ఉందని, నూతన కలెక్టరేట్ కూడా నిర్మాణంలో ఉంది.

ఇవన్నీ పూర్తయితే ఎలక్ట్రిషన్, ప్లంబర్ తదితర కోర్సులలో శిక్షణ పొందిన వారికి ఉద్యోగ ,ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అన్నారు. అలాగే కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ప్రభుత్వ పాఠశాలలో ఇన్స్ట్రక్టర్లుగా నియమిస్తామని వెల్లడించారు.  నల్గొండ సెట్ విన్ ద్వారా ఇంకా మరిన్ని కోర్సులను ఏర్పాటు చేయాలని, అందరికీ పని చూయించాలని, పిల్లల చదువు, అభివృద్ధికి మహిళలు ,పురుషులు కలిసి పని చేస్తేనే సాధ్యమవుతుందని అన్నారు. అనంతరం మంత్రి మీడియా తో మాట్లాడుతూ త్వరలోనే మూసి ప్రక్షాళన చేపట్టనున్నామని, మూసి వల్ల భూగర్భ జలాలు కలుషితమై నల్గొండ జిల్లాలోని 30 లక్షల మంది ప్రజలు బాధపడుతున్నారు. 

దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మొదటి దశలో 21 కిలోమీటర్లు, రెండవ దశలో మరో 21 కిలోమీటర్లు  మూసి ప్రక్షాళనకు టెండర్లు పిలిచిందని , ప్రభుత్వం చేపట్టిన ఈ మంచి కార్యక్రమానికి ప్రతిపక్షాలు ఎవరు అడ్డుపడవద్దని కోరారు .డిండి ప్రాజెక్టు పై మంత్రి మాట్లాడుతూ గతంలో చెప్పిన ప్రకారం డిండి ప్రాజెక్టు టెండర్లు పిలిచి వెంటనే పనులు ప్రారంభించాలని రాష్ట్ర నీతిపారుదల శాఖ మంత్రికి ముఖ్యమంత్రి ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ నాయిపుణ్యభివృద్ధి ద్వారా స్వయం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో గతంలో కేవలం జంట నగరాగాలకు మాత్రమే పరిమితమైన సెట్విన్ ను జిల్లాలకు విస్తరించడం జరిగిందని, ప్రతి సంవత్సరం 25,000 మందికి శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.

నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒక కోర్సులో శిక్షణ పొందాలని, సెట్విన్ ద్వారా ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు ఖాళీగా ఉండకుండా స్వయం ఉపాధి చూసుకోవాలని, స్వయం సహాయక మహిళా సంఘాలలో సభ్యులు గారు చేరితే బ్యాంకు నుండి రుణాలు ఇప్పిస్తామని, 10 నుండి 15 మంది ముందుకు వస్తే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కింద సహకారం అందిస్తాం.

ప్రభుత్వం ద్వారా యూనిఫార్మ్స్ కుట్టించే అవకాశం తో పాటు, ఇతర ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. రాబోయే కాలంలో ఈవి వాహనాలు ,ఆటో ట్రాలీలకు మంచి డిమాండ్ ఉందని, ఇలాంటివన్నీ నేర్చుకోవాలని, నేర్చుకున్న శిక్షనను వదిలివేయకుండా ఉద్యోగాలు చూసుకోవాలని తెలిపారు. సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ ఉపేందర్ రెడ్డి ,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆఫీస్ ఖాన్, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కుట్టుమిషన్లు, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జ్  అదనపు కలెక్టర్ వై .అశోక్ రెడ్డి, సెట్విన్ ప్రిన్సిపల్ రేణుక, తదితరులు పాల్గొన్నారు.