18 May, 2026 | 3:45 AM

గేదెలపైకి దూసుకెళ్లిన కారు

18-05-2026 02:40 AM

మహబూబాబాద్, మే 17 (విజయక్రాంతి): అతివేగం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల కారు అదు పు తప్పి పాడి గేదెలపై దూసుకెళ్లిన ఘటన శనివారం అర్ధరాత్రి గూడూరు మండలం బొడ్డుగొండ సమీపంలో చోటుచేసుకుంది.

మహబూబాబాద్ నుంచి మేడారం వైపు వెళ్తున్న ఓ కారు రోడ్డు దెబ్బతిన్న ప్రాంతంలో వేగంగా ప్రయాణిస్తూ అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న గేదెల మందలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం రాత్రి సుమారు 1:30 గంటల సమయంలో జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో నంజాల వెంకటేశ్వర్లుకు చెందిన ఐదు పశువులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందులో మూడు పాడి గేదెలకు తీవ్రమైన గాయాలు కావడంతో వాటి నడుములు విరిగిపోయాయని, మరో రెండు దూడలు అక్కడికక్కడే మృతి చెందాయని, దీంతో రైతుకు సుమారు 3 లక్షల వరకు ఆర్థిక నష్టం వాటిల్లినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.

ప్రమాద సమయంలో కారులో ఉన్న వ్యక్తులకు స్వల్ప గాయాలు కాగా, స్థానికులు వెంటనే స్పందించి వారిని బయటకు తీసి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు.ఇటీవల రోడ్డు దెబ్బతిన్న ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు రాత్రివేళల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.