నాడు సుందరం.. నేడు శిథిలం
- ఈ ఖర్చు ఎవరు భరించాలి?
- ప్రభుత్వం( ప్రజలా) నా లేక నిర్మాణం చేపట్టిన వారా?
ఖమ్మం టౌన్, మే 17 (విజయ క్రాంతి): మంత్రి మీద ప్రేమతో అభిమానులు పైలాన్ నిర్మాణం చేపట్టారు. వేరే పార్టీ వారు వ్యతిరేకించటంతోనో లేక మాజీ ప్రధాని పీ.వీ.నరసింహరావు విగ్రహం ప్రక్కన ఇదేమిటి అని ప్రజలు అనుకొంటుండటము తోనో లేక మంత్రి కి ఇలాంటివి నచ్చకనో, స్వయానా ఆ మంత్రే కూలగొట్టండి అని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు హుటాహుటిన పైలాన్ కూల్చారు. అంతా బాగానే ఉంది కానీ అందంగా ఉన్న ఈ ప్రదేశం ఇప్పుడు శిధిలంగా దర్శనమిస్తోంది.
రేపో లేక తరువాత అధికారులు మళ్ళీ పాత రూపు రేకలు తెస్తారు. కానీ ఈ ఖర్చు ఎవరు భరించాలి. ప్రభుత్వం నా (అంటే ప్రజలదే కదా) లేక ఎవరైతే పైలన్ కట్టారో వారే ఈ ఖర్చు పెట్టుకొంటారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఇటీవల మంత్రి గా 40 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా ఖమ్మం పట్టణంలోని మమతా సర్కిల్ వద్ద గల మాజీ ప్రధాని పీ వీ నరసింహారావు విగ్రహం వెనుక తుమ్మల అభిమానులు ఒక పెద్ద పైలాన్ నిర్మాణం చేపట్టారు. దేశ ప్రధానిగా చేసిన పీ వీ నరసింహారావు విగ్రహం ప్రక్కన ఈ పైలాన్ నిర్మించటం పై బి జె పి రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు వ్యతిరేకించారు.
అదేవిధంగా వేరే పార్టీ వారు, కొందరు ప్రజలు కూడా పీ వీ నరసింహారావు ప్రక్కన ఈ నిర్మాణం చేపట్టడం పై వ్యతిరేకత వ్యక్తం చేసారు. ఈ నిర్మాణం విషయం మంత్రి తుమ్మలకు తెలవటంతో ఇటువంటివి తనకు నచ్చవని, తన అభిమానులు తనపై ఉన్న అభిమానంతో ఈ నిర్మాణం చేపట్టారని పైలాన్ కూలగొట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దింతో అధికారులు పైలాన్ ను కూలగొట్టారు. కొందరికి ఈ విషయం తెలవక ఇక్కడ ఏమి జరుగుతుందని ఆ చుట్టూ ప్రక్కల వారిని అడిగి తెలుసుకొన్నారు.
ఎంతో సుందరంగా వున్న ఈ ప్రదేశం ఇప్పుడు శిధిలంగా దర్శనమిస్తుంది. ఈ ప్రదేశానికి పక్కనే ట్యాంక్ బండ్ వుంది నిత్యం వందలాదిగా వారంతాలలో వేలాదిగా ట్యాంక్ బండ్ కు వస్తారు. శిధిలంగా ఉండటంతో ఏమి జరిగింది అని వారు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అసలు ఇక్కడ పైలాన్ నిర్మాణం కు పర్మిషన్ ఉందా, నాయకుల మీద అభిమానం వుంటే ఎక్కడ పడితే అక్కడ పైలాన్ నిర్మాణం చేపడతారా, ఇక్కడ పునర్ నిర్మాణానికి అయ్యో ఖర్చు ఎవరు పెట్టుకుంటారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.






