ఉచిత హెల్త్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే జారె
దమ్మపేట, మార్చి 11(విజయక్రాంతి): దమ్మపేట మండల కేంద్రంలో ప్రాథమిక వైద్యశాల నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఉచిత హెల్త్ క్యాంపును అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత హెల్త్ క్యాంపులను ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు.
ఈ హెల్త్ క్యాంపుల్లో ఆరోగ్య పరీక్షలు చేయడం ద్వారా జబ్బులను ముందుగానే గుర్తించి మెరుగైన వైద్యం, తగిన సలహాలు అవసరమైన మందులు ఇవ్వడంతో పాటు తీవ్రత ఎక్కువ ఉన్న కేసులను పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆరోగ్య పథకాల గురించి అవగాహన కల్పించడం, గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్య వివరాలు పరిశీలించి తగిన వైద్యం అందిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఉచిత క్యాంపులను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సమయానికి వైద్యులు అందుబాటులో లేనందున ఆగ్రహం వ్యక్తం చేసి విధులు సక్రమంగా నిర్వర్తించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ పగడాల రమాదేవి, ఉపసర్పంచ్ ఆంగోత్ శ్రీనివాసరావు, మందలపల్లి సర్పంచ్ గుజ్జుల శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు కక్కిరాల రమేష్ , టౌన్ అధ్యక్షులు చిన్నశెట్టి చిట్టిబాబు, చిన్నశెట్టి యుగంధర్, పగడాల రాంబాబు, అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు




