మజీద్పల్లిలో ఈతవనం ధ్వంసం చేసిన దుండగులు
ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితులపై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ సీఐ బ్రహ్మానంద రెడ్డి
గజ్వేల్, ఏప్రిల్ 8: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మజీద్పల్లిలో ఈత వనాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈతవనంలోని కళ్ళు తీసేలా ఎదిగిన 130 ఈత చెట్లను ఈ గ్రామానికి చెందిన కొందరు దుండగులు ధ్వంసం చేయడంతో గొడవ కులస్తులు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈమెరకు ఎక్సైజ్ పోలీసులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. గత 30 సంవత్సరాలుగా ఈత వనాన్ని పెంచి పోషిస్తున్నామని, కల్లు గీసే సమయానికే చెట్లను నరికి వేయడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామంలోని కొందరు నాయకులు కావాలనే కుల వివాదాలను రెచ్చగొట్టి గ్రామస్థుల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తరతరాలుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామని, చెట్లను నరికివేయడం వల్ల గౌడ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎక్సైజ్ సీఐ బ్రహ్మానంద రెడ్డి, ఎస్త్స్ర సాయి కృష్ణ, తొగుట సిఐ లతీఫ్ ఖాన్, బేగంపేట ఎస్త్స్ర లు కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
గౌడ కులస్తుల ఫిర్యాదు మేరకు ఎక్సైజ్ పోలీసులు గ్రామంలో ప్రజలను విచారించి నిందితులపై కేసులు నమోదు చేశారు. ఎక్సైజ్ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఈతవనాలను, చెట్లను ధ్వంసం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మజీద్ పల్లి ఘటనలో ప్రజలను విచారించి ఇట్టి నేరానికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసామన్నారు. అనుమతి లేకుండా ఈత చెట్లను తొలగించడం తెలంగాణ ఎక్సైజ్ చట్టం ప్రకారం నేరం అని, ఇట్టి నేరానికి పాల్పడిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ బ్రహ్మానందరెడ్డి తెలిపారు.




