వన మహోత్సవ లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి
- రేపు పెద్ద ఎత్తున మాస్ ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టాలి
- రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
ఆదిలాబాద్,(విజయక్రాంతి): వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె అటవీశాఖ ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వన మహోత్సవ్ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో మంగళవారం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు.
జిల్లాల వారీగా నిర్దేశిత లక్ష్యాలు, ఇప్పటివరకు నాటిన మొక్కలు, పూర్తి చేయాల్సిన మిగిలిన లక్ష్యం, నర్సరీల్లో అందుబాటులో ఉన్న మొక్కలు, జియో ట్యాగింగ్ తదితర వివరాలపై ఆరా తీశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్యాలకు చేరువ కావాలన్నారు. రేపటి మాస్ ప్లాంటేషన్ కార్యక్రమంలో విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళలు భాగస్వామ్యం కావాలని కోరారు.
ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని కంటికి రెప్పలా సంరక్షించాలని, ప్రతి మొక్కకూ రక్షణగా కంచె ఏర్పాటు చేసి తప్పనిసరిగా జియో ట్యాగింగ్ చేయాలని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ వీడియో హాల్ నుంచి జిల్లా కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు.
వీసీ ముగిసిన అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ.. మంగళవారం తలపెట్టిన భారీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. అటవీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మిగిలిన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద ఎత్తున కదిలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్, ఇచ్చోడ అటవీ అభివృద్ధి అధికారులు విశ్వనాథ్ బుసారెడ్డి, ప్రథమేష్, డీఆర్డీవో రవీందర్, అదనపు డీఆర్డీవో రామ్ప్రసాద్, ఏపీడీ గజానంద్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






