విలీనమా.. ఎన్నికలా!
అయోమయంలో ఆర్టీసీ కార్మికులు
- ఎన్నికల నిర్వహణకు మంత్రుల కమిటీ హామీ
- ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో విలీనంపై డిమాండ్
- 40రోజులు గడిచినా వెలువడని ప్రభుత్వ నిర్ణయం
- ఏదో ఒకటి త్వరగా తేల్చాలని కార్మిక సంఘాల విజ్ఞప్తి
హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారా.. లేక గత ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని (ప్రభుత్వంలో విలీనం) అమలు చేస్తారా..? ఇప్పుడు తెలంగాణలోని ఆర్టీసీ కార్మికు లు, ఉద్యోగులను తొలుస్తున్న ప్రశ్న. ప్రభుత్వంలోని పెద్దలు రెండు విభిన్నమై న వైఖరులతో ముందుకు సాగుతుండ టం.. వారిని అయోమయానికి గురి చేస్తోంది. ఏది ముందుగా అమలు చేస్తారనే ఉత్కంఠ కార్మిక వర్గాల్లో నెలకొంది. అసలు అమలు చేస్తారా.. తాత్సారం చేస్తారా? అనే చర్చ కూడా నడుస్తుండటం గమనార్హం.
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో దిగొచ్చిన ప్రభుత్వం.. వారితో చర్చలు జరిపింది. ఇందుకోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు తదితరులతో వేసిన కమిటీ ఏప్రిల్ 24న కార్మికులతో ప్రత్యేకంగా భేటీ అయింది. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో మంత్రులకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు పలు విజ్ఞప్తులు చేశారు.
తక్షణం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని, ఇందుకు నిర్ధిష్టమైన గడువు నిర్ణయించాలని కోరారు. దీనిపై మంత్రుల కమిటీ స్పష్టమైన హామీ ఇచ్చింది. ముందుగా కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని, తదుపరి అధికారుల కమిటీలో గుర్తింపు సంఘం ప్రతిని ధులను చేర్చి విలీనపంఐ చర్చిస్తామని, ఆ తరువాత ప్రక్రియ పూర్తిచేస్తామని చెప్పారు. మంత్రుల హామీలతో కార్మికులు సమ్మె విరమించారు.
విలీనంపై రాతపూర్వకంగా సీఎంకు వినతి..
కార్మిక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మే 1వ తేదీన ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సమ్మెను విరమించినందుకు అభి నందించిన సీఎం.. వారి డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. ఏం కావాలో అప్షన్ చెప్పాలంటూ సూచించారు. కాగా ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక సంఘాల ప్రతినిధులు అక్కడికక్కడే తమ నిర్ణయాన్ని ముఖ్యమంత్రికి తెలియజేసి రాతపూర్వకంగా ముఖ్యమంత్రికి అందజేశారు. కార్మిక సం ఘాల ఆలోచన మేరకు ముందుకెళ్దామని సీఎం వారికి హామీ ఇచ్చారు.
ప్రభుత్వ నిర్ణయం ఏదీ?
మంత్రుల కమిటీ ఇచ్చిన హామీ ప్రకారం కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహిస్తారా? లేక సీఎం ఇచ్చిన హామీ మేరకు విలీనానికి చర్య లు తీసుకుంటారా? అనేది ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. 40 రోజు లు గడుస్తున్నా ప్రభుత్వం నిర్ణయం బయటకు రావడం లేదు. వాస్తవానికి ఎన్నికలు నిర్వహించాలనుకుంటే.. గడిచిన 40 రోజు ల్లో పూర్తిచేసే వారు. అలాగే విలీనంపై అపాయింటెడ్ డేను ప్రకటిస్తూ గెజిట్ జారీ చేస్తే సరిపోతుంది.
కానీ, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడకపోవడంతో కార్మికుల్లో గందరగోళం, అయోమయం నెలకొం ది. తమ విషయాన్ని ప్రభుత్వం ఎటూ తేల్చకుండా కాలయాపన చేస్తున్నారనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏదో ఒకటి తేల్చి, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. తొలుత ఎన్నికలే నిర్వహించాలనుకుంటే నెల రోజు ల్లో పూర్తి చేయాలని కోరుతున్నారు.






