ధాన్యం రవాణాకు లారీ యజమానులు సహకరించాలి
పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి
గోదావరిఖని, మే 13(విజయక్రాంతి): రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు కేంద్రాల నుండి గోదాములకు తరలించేందుకు లారీ యజమానులు పూర్తి స్థాయిలో సహకరించాలని పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం గోదావరిఖని గంగానగర్లోని లారీ అసోసియేషన్ కార్యాలయాన్ని ఏసీపీ రమేష్, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావుతో కలిసి ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరి, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ వేగంగా జరుగుతోందని, రవాణా సౌకర్యం లేక రైతులు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ముఖ్యంగా పీఏసీఎస్ మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రక్రియకు అవసరమైన వాహ నాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉం చాలని లారీ అసోసియేషన్ ప్రతినిధులను కోరారు.
సమన్వయంతోనే రైతులకు మేలు
రైతుల కష్టానికి తగిన ఫలితం దక్కాలంటే రవాణాదారులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీసీపీ సూచించారు. ధాన్యం నిల్వలు పెరగకుండా వేగవంతమైన రవాణా సదుపాయం కల్పించాలని తెలిపారు. దీనిపై లారీ అసోసియేషన్ సభ్యులు సానుకూలంగా స్పందిస్తూ, రైతుల ప్రయోజనాల దృష్ట్యా తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సంఘం సభ్యులు, లారీ యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు.






