అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
వైద్య చికిత్స కోసం రూ. 2.50 లక్షల ఎల్ఓసీ మంజూరు
మంథని,(విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలోని కమాన్పూర్ మండలం, రొంపికుంట గ్రామానికి చెందిన వడ్లకొండ ధృవీశ్క్ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడి ఆర్థిక పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు, సహాయం కోసం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుని ఆశ్రయించారు.
స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 2,50,000 (రెండు లక్షల యాభై వేల రూపాయల) విలువైన ఎల్ఓసీ ని మంజూరు చేయించారు. ఈ మేరకు మంజూరైన పత్రాలను హైదరాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ క్లిష్ట సమయంలో సత్వరమే స్పందించి, వైద్య చికిత్సకు ఆర్థిక భరోసా కల్పించిన మంత్రి శ్రీధర్ బాబు కి బాధితుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.






