కుక్కల దాడిలో గాయపడి మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన జడ్జి దుర్గం గణేష్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన బాలిక కుటుంబాన్ని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్ మంగళవారం పరామర్శించారు. బాధిత కుటుంబం పనిచేస్తున్న ఇటుకబట్టీ కి వెళ్లి మృతి వివరాలను బాలిక తల్లిదండ్రులతో అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు ఇటుక బట్టీల్లో కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.
కార్మికుల కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఇటుక బట్టీ యజమానికి సూచించారు. న్యాయసేవాధికార సంస్థ ద్వారా బాధిత కుటుంబానికి తగు సహాయం అందించడం జరుగుతుందని, దాడికి సంబంధించిన వివరాల నివేదికను జిల్లా జడ్జికి పంపించడం జరుగుతుందని జడ్జి గణేశ్ తెలిపారు. జడ్జి వెంట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వోడ్నాల రవీందర్, ప్రధాన కార్యదర్శి అవునూరి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు ఆవుల శివకృష్ణ, ఏజీపీ దూడం ఆంజనేయులు తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.






