21-02-2026 01:42:06 AM
క్యూలో చెప్పులు..ఇదేనా మార్పు?
పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేయాలి
లేదంటే జూబ్లీ ప్యాలెస్ ముట్టడి తప్పదు
రేవంత్ సర్కార్పై హరీశ్రావు ఆగ్రహం
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి) : ‘ దేశానికి అన్నం పెట్టే రైతుపై ప్రభుత్వానికి ఇంత కర్కశత్వమా? షాపుల్లో అమ్మాల్సిన యూరియాను, యాపుల్లో ఇస్తామని ఆర్భాటం చేసి.. చెప్పులు క్యూలో పెట్టే దుస్థితికి తీసుకొచ్చారు.. అయినా.. యూరియా దొరకని పరిస్థితి. ఇదేనా మీ ప్రజాపాలన మార్పు’ అంటూ మాజీ మంత్రి హరీశ్రావు ఎక్స్వేదికగా రేవంత్రెడ్డిని నిలదీశారు.
యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలపై శుక్రవారం ట్విట్టర్ వేదికగా హరీశ్రావు స్పందించారు. గుండెలు మండి మీ ప్రభుత్వంపై తిరగబడుతున్న అన్నదాత రోదన మీకు అర్థమవుతుందా? అని సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరిదీ ఇదే పరిస్థితి ఉందని తెలిపారు.
నిరక్షరాస్యులు, స్మార్ట్ ఫోన్ లేని లక్షలాది మంది రైతులు ఏ విధంగా యాప్ను వినియోగిస్తారన్న కనీస సోయి కూడా మీ ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. యూరియా యాప్ను రద్దు చేసి, పాత విధానంలో, షరతుల్లేకుండా రైతులకు యూరియా సరఫరా చేయాలని తెలంగాణ రైతాంగం పక్షాన డిమాండ్ చేశారు. లేదంటే యూరియా కష్టాలు భరించని రైతులు మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ను ముట్టడించే రోజులు వస్తాయని హెచ్చరించారు.