అటు దాన్యం.. ఇటు మక్కలు గోల్మాల్ ?
విచారణ చేపట్టిన అధికారులు
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో రైతుల నుండి ఇటీవల ప్రభుత్వం కొనుగోలు చేసిన మక్కజొన్నలు, ధాన్యం గోల్మాల్ జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, మార్క్ఫెడ్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మార్క్ఫెడ్ సంస్థ ద్వారా రైతుల నుండి కొనుగోలు చేసి వ్యవసాయ మార్కెట్లో నిలువచేసిన మూడు లక్షల బస్తాలకు పైగా మక్కలను నిలువ చేసింది. మార్కెట్లో నిలువచేసిన మక్కజొన్నలకు రక్షణ కోసం ప్రైవేట్ కాంట్రాక్టర్కు బాధ్యతలు అప్పగించింది. అయితే మార్కెట్లో నిలువ చేసిన మొక్కజొన్న బస్తాల్లో నుంచి గురువారం కొందరు దుండగులు దొంగిలించి మార్కెట్లో విక్రయించడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. ఈ మేరకు ఆ మొక్కజొన్నలను అధికారులు స్వాధీనం చేసుకొని శుక్రవారం క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు.
రైస్ మిల్లులో ధాన్యం మాయం?
రైతుల నుండి సివిల్ సప్లై సంస్థ కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యం పట్టించి ఇవ్వడానికి కేసముద్రం మండలంలోని ఓ రైస్ మిల్లర్ కు కేటాయించిన సన్నధాన్యం మాయం చేసినట్లు వచ్చిన ఆరోపణ నేపథ్యంలో శుక్రవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆ మిల్లులో తనిఖీలు నిర్వహించారు. గత సోమవారం జిల్లాలోని కొన్ని రైస్ మిల్లులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించి, కొందరు మిల్లర్లు సన్నధాన్యాన్ని స్వాహా చేసినట్లు గుర్తించి, వారిపై క్రిమినల్ చర్యలకు ఉన్నత అధికారులకు నివేదిక అందించారు. ఈ క్రమంలో కేసముద్రం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన రైస్ మిల్లర్ కూడా తనకు కేటాయించిన ధాన్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు ఫిర్యాదులు రావడంతో క్షేత్రస్థాయి విచారణ జరిపారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని అధికారులు స్పష్టం చేశారు. రైతుల నుండి కొనుగోలు చేసిన మక్కజొన్నలు, ధాన్యం పక్కదారి పట్టిన ఘటనలు కేసముద్రం మండలంలో తీవ్ర సంచలనం సృష్టించాయి.






