07-02-2026 08:01:21 PM
జిల్లా కలెక్టర్ కె.హరిత
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, డిఆర్డిఓ దత్తారావు, డీ డబ్ల్యూ ఆడెపు భాస్కర్ తో కలిసి అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం, ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై సమీక్ష నిర్వహించారు.
2024 సంవత్సరంలో జిల్లాలోని 720 పాఠశాలల్లో చేపట్టిన తాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, భవనాల మరమ్మత్తు పనులకు సంబంధించిన ఎంబీలు సమర్పించాలని, పెండింగ్ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. బాలికల కోసం ప్రత్యేక మూత్రశాలల నిర్మాణాలు మార్చి నెలలోగా పూర్తిచేయాలని, గ్రామ సమాఖ్య, అంగన్వాడి భవనాల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.