ఆయిల్ ఫామ్ తో అధిక లాభాలు
- శ్రీగిరిపల్లిలో మెగా ఆయిల్పామ్ నాట్లు..
గజ్వేల్: ఆయిల్ పామ్ సాగుతో రైతులు అధిక ఆదాయాన్ని పొందవచ్చును ఏడిఏ బాబు నాయక్ అన్నారు. గజ్వేల్ మండలంలోని శ్రీగిరిపల్లి గ్రామంలో శుక్రవారం జాతీయ తినదగిన నూనెల మిషన్– ఆయిల్ పామ్ పథకం ఆధ్వర్యంలో మెగా ఆయిల్పామ్ నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన రైతు ఎల్లు కిష్టరెడ్డి నాలుగు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్పామ్ మొక్కలను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన ఏ డి ఏ బాబు నాయక్, మండల వ్యవసాయ అధికారి నాగరాజు, ఉద్యానవన శాఖ అధికారి సౌమ్య మాట్లాడుతూ రైతులు పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అధిక ఆదాయం అందించే ఆయిల్పామ్ సాగును చేపట్టాలని సూచించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న జాతీయ తినదగిన నూనెల మిషన్–ఆయిల్పామ్ పథకం ద్వారా మొక్కలు, సాంకేతిక సలహాలు, వివిధ ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయని, అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయిల్పామ్ సాగు దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయాన్ని అందించే పంటగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ క్షేత్ర అధికారి తులసితో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.






