అటవీ జంతువుల ప్రాణాలే లక్ష్యం..
జాతీయ రహదారిపై అటవీ శాఖ ప్రత్యేక అవగాహన..
వేగం తగ్గిస్తేనే ప్రాణాలు నిలుస్తాయి..
రామాయంపేట,(విజయ క్రాంతి): మెదక్ నుండి రామాయంపేట వరకు ఉన్న జాతీయ రహదారి NH-765DGలో అటవీ ప్రాంతం గుండా ప్రయాణించే వాహనదారులకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట అటవీ క్షేత్ర అధికారి బి. విద్యాసాగర్, మెదక్ అటవీ క్షేత్ర అధికారి బి. గణేష్తో పాటు అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అటవీ ప్రాంతంలో అధిక వేగంతో వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించడమే కాకుండా అడవి జంతువులు వాహనాల కింద పడి మృత్యువాత పడే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు.
వాహనదారులు అటవీ ప్రాంతాల్లో వేగాన్ని నియంత్రించి, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని, అడవి జంతువులు అకస్మాత్తుగా రహదారిపైకి వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ప్రయాణించాలని కోరారు. అటవీ సంపదతో పాటు వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. ప్రజల సహకారంతోనే వన్యప్రాణులను కాపాడటంతో పాటు రోడ్డు ప్రమాదాలను కూడా గణనీయంగా తగ్గించవచ్చని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది పాల్గొని వాహనదారులకు అవగాహన కల్పించారు.






