06-02-2026 01:51:45 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): ఆధునిక పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం, కలెక్టర్ అభిలాష అభినవ్, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు వ్యవసాయం లాభసాటిగా మార్చేలా అధికారులు చేయూతను ఇవ్వాలని అన్నారు. పంట మార్పిడి విధానం రైతులకు అలవాటు చేయాలని తెలిపారు. సహజ ఎరువుల వాడకం పెంచేలా కృషి చేయాలని చెప్పారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కింద నిర్దేశించిన అన్ని లక్ష్యాలు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. క్షేత్ర స్థాయిలో మండల వ్యవసాయ అధికారులు ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పారు. జిల్లాలో ఆయిల్ పామ్ పంటల సాగు విస్తీర్ణం మరింత పెంచాలని తెలిపారు. రైతులకు అధిక లాభసాటిగా ఉండే ఉద్యాన పంటలైన పండ్లు, కూరగాయలు, పూల పంటల విస్తారం పెంచే విధంగా అధికారులు చొరవ చూపాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, ఎడిఎ లు విద్యాసాగర్, శ్రీనివాస రాజు, సుజాత, వీణ, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.