ఎస్సీ, ఎస్టీ బాధితులకు సత్వర న్యాయం అందించాలి
- మానిటరింగ్ కమిటీ సభ్యులు బెజ్జంసాయి
మిర్యాలగూడ,(విజయక్రాంతి): ఎస్సీ ఎస్టీ బాధితులకు అట్రాసిటీ యాక్ట్ కేసులతోపాటు ఇతర సందర్భాల్లో సామాజిక వివక్షతకు గురైతే పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధ్యులపై తగు చర్యలు తీసుకొని బాధితులకు సత్వర న్యాయంతో పాటు పరిహారం అందించాలని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మా నిటరింగ్ కమిటీ సభ్యులు బెజ్జం సాయి(సైదులు) అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్ సమావేశ మందిరంలో కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన మొదటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ కేటగిరిలతోపాటు ముఖ్యంగా దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో పోలీసులు చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
దళిత వాడల్లో మౌలిక సదుపాయాల కల్పన, దళితుల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల్ని చేపట్టాలన్నారు. చట్టాల పై దళితులలో చైతన్యం తీసుకువచ్చి అట్రాసిటీ యాక్ట్ అమలు అనంతరం విచారణ పారదర్శకంగా నిర్వహించి చట్టాలను కఠిన తరంగా అమలు చేసి బాధ్యులపై చర్యలు తీసుకొని బాదితులకు న్యాయం చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీ కేసుల వివరాలను తెలుసుకొని పురోగతిని సమీక్షించినట్లు తెలిపారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవా ర్ కేసుల వివరాలను తెలియజేస్తూ ఎస్సీ, ఎస్టీ బాధిత కుటుంబాలకు చట్ట పరిధిలో న్యాయం జరిగేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాల్ని అందజేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భాస్కర్ నాయక్, సంకు ధనలక్ష్మి, ఏ కుల అనిత కుమారి, భీమనపల్లి సైదులు, కర్నాటి కరుణాకర్ రెడ్డి, పాదం అనిల్, బూరుగు శ్రీనివాస్ గౌడ్, డీఎస్పీలు రాజశేఖర్ రాజు, శివరాం రెడ్డి, ఆర్డీవోలు, ఎస్సీ డీడీ శశికళ, సిపిఓ శ్రీనివాస్ నాయక్, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి జీ.వి రమేష్, జిల్లా సహకార శాఖ అధికారి పత్యా నాయక్, తదితరులున్నారు.




