05-02-2026 12:30:02 AM
ఆదిలాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన భీంపూర్ మండలం పిప్పల్ కోటి పాఠశాలలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ)గా పని చేస్తున్న పడాల రవీందర్ను విధుల నుండి తొలగిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి రాజేశ్వర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండల విద్యాశాఖాధికారి సమర్పించిన నివేదిక ప్రకారం, సదరు ఉద్యోగి ఒక రాజకీయ పార్టీలో చేరడమే కాకుండా, ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నట్లు నిర్ధారణ అయిందన్నారు.
రాజకీయ ప్రచారం పై పలు దినపత్రికల్లో వచ్చిన వార్తలు, విచారణలో బయటపడ్డ ఆధారాలను పరిగణనలోకి తీసుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు డీఈవో తెలిపారు. క్రమశిక్షణా ఉల్లంఘనకు సంబంధించి ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండానే సదరు ఉద్యోగిని తక్షణమే విధుల నుంచి తొలగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పేర్కొన్నారు.